మామిళ్లగూడెం, సెప్టెంబర్ 2: దేశంలోకెల్లా ఖమ్మం ఐడీవోసీలోనే మొట్టమొదటి సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. సౌర విద్యుత్ ఉన్న కలెక్టరేట్లలో ఖమ్మానిదే ప్రథమస్థానమని అన్నారు. ఐడీవోసీ అధికారులు, సిబ్బంది వాహనాల పారింగ్ కోసం ఖమ్మం నూతన కలెక్టరేట్లో రూ.1.58 కోట్లతో ఏర్పాటు చేసిన 200 కిలో వాట్ల సామర్థ్యం గల సోలార్ పారింగ్ షెడ్ను శనివారం ఆయన ప్రారంభించారు. గ్రిడ్ అనుసంధాన ప్రక్రియకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కలెక్టర్ గౌతమ్ హాజరై స్విచ్ ఆన్ చేశారు. అనంతరం ఐడీవోసీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. 200 కేడబ్ల్యూ ప్లాంట్తో రోజుకు 800 నుంచి 1000 యూనిట్ల పవర్ ఉత్పత్తి అవుతుందని, ఈ పవర్ని ఐడీవోసీ అవసరాలకు ఉపయోగిస్తామని, మిగిలిన విద్యుత్ను గ్రిడ్ అనుసంధానం చేస్తామని వివరించారు.
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. 20 ఎకరాల నూతన కలెక్టరేట్కు ఫెన్సింగ్ నిమిత్తం ఎంపీ ల్యాడ్ నుంచి రూ.40 లక్షలు, సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎమ్మెల్సీ తాతా మధు తన నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేశారని అన్నారు. రూ.కోటి సుడా నిధులతో గ్రీనరీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఐడీవోసీలు నిర్మించారని అన్నారు. ఈ సందర్భంగా నూతన కలెక్టరేట్ నిర్మాణానికి సహకరించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్లను మంత్రి అజయ్కుమార్ సన్మానించారు. అనంతరం మంత్రి పువ్వాడను కలెక్టర్ సత్కరించారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, అదనపు కలెక్టర్ డీ.మధుసూదన్నాయక్, టీఎస్రెడ్కో మేనేజర్ మహేందర్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.