ఖమ్మం, నవంబర్ 26: అటు దేశంలోగానీ, ఇటు రాష్ట్రంలోగానీ అసలు కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. అలాంటి ఆ పార్టీ నేతలు ఇక ప్రజలకేం గ్యారెంటీలిస్తారని ఎద్దేవాచేశారు. దేశాన్ని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. ప్రజలు 11 సార్లు అవకాశం ఇచ్చినా వారికి పావలావంతు కూడా మేలు జరగలేదని ధ్వజమెత్తారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తామంటూ ముందుకు వస్తుండడం విడ్డూరంగా విమర్శించారు. గత 11 పర్యాయాల్లో చేయని అభివృద్ధిని ఇప్పుడెలా చేస్తారంటూ ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలో ఆదివారం పర్యటించిన ఆయన.. 4, 5, 6 డివిజన్లలో నిర్వహించిన రోడ్ షోల్లో మాట్లాడారు. అభివృద్ధికి మారుపేరుగా నిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. అందులో భాగంగానే నేడు తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ఘనతను సొంతం చేసుకుందని అన్నారు.
అటు సంక్షేమంలో కూడా అన్ని రాష్ర్టాల్లోకెల్లా తెలంగాణ మొదటి స్థానమని అన్నారు. అందుకే ఇక్కడి పథకాలు తమకూ కావాలంటూ పొరుగు రాష్ర్టాల ప్రజలు కూడా అక్కడి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారని అన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక పింఛన్లను రూ.200 చొప్పున ఇస్తే ఇప్పుడు సీఎం కేసీఆర్ వాటిని రూ.2016, రూ.4016గా ఇస్తున్నారని గుర్తుచేశారు. ఇన్నేళ్లలో ఇలాంటి పింఛన్లను కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేకపోయిందని ప్రశ్నించారు. అలాగే, స్థానికేతరుల వల్ల నియోజకవర్గానికి ఉపయోగం ఏమీలేదని అన్నారు. ఇక్కడి ప్రజల అవసరాలు, కష్టాలు తెలిసిన తన వల్లనే ఖమ్మం ఇంతలా అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. అయితే, ఖమ్మం అభివృద్ధి అతడి వల్లనేనని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకుంటుండడం సిగ్గుచేటని అన్నారు. ఇక్కడి అభివృద్ధిని తుమ్మల చేసి ఉంటే అందుకు నిధులు ఇచ్చింది సోనియాగాంధీనా? అని ప్రశ్నించారు. 30న జరిగే ఎన్నికల్లో తనకు అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు.