‘నమస్తే’ ఇంటర్వ్యూలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ప్రత్యర్థులెవరైనా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది నియోజకవర్గాలను కైవసం చేసుకుంటాం. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా.. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. ఎన్ని తప్పుడు కూతలు కూసినా విజయం బీఆర్ఎస్ అభ్యర్థులదే. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం బలగం’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పువ్వాడను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో మంగళవారం మంత్రి పువ్వాడ ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’తో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనుసరించే కార్యాచరణ ప్రణాళికపై ఇంటర్వ్యూలో వివరించారు.
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే వెయ్యి ఏనుగుల బలమని, ప్రత్యుర్థులెవరైనా విజయం బీఆర్ఎస్దేనని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇప్పటివరకు పార్టీ సాధించిన ప్రతి విజయం వెనుక కార్యకర్తల సమష్టి శ్రమ దాగి ఉందని, కార్యకర్తల అండదండలతో వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది శాసనసభ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. ప్రజలకు ప్రభుత్వానికి కార్యకర్తలు వారధిగా వ్యవహరించడం వల్లే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులకు చేరాయని వివరించారు. ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పువ్వాడను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో మంగళవారం మంత్రి పువ్వాడ ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’తో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనుసరించే కార్యాచరణ ప్రణాళికపై ఇంటర్వ్యూలో వివరించారు.
ప్రశ్న : ఎన్నికలకు బీఆర్ఎస్ ఏ విధంగా సన్నద్ధమవుతున్నది?
జవాబు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది ఎమ్మెల్యే స్థానాల గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల యుద్ధరంగంలోకి అడుగుపెట్టబోతోంది. సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికీ అందించిన సంక్షేమ ఫలాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి బీఆర్ఎస్ను మరోసారి ఆదరించాలని ఓటర్లను అభ్యర్థిస్తాం. జిల్లాలో ఏ రాజకీయ పార్టీకి లేనంత కార్యకర్తల బలం గ్రామీణస్థాయిలో మా పార్టీకి ఉంది. ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేసే విధంగా బీఆర్ఎస్ విజయం ఉండబోతోంది. ఖమ్మం అభ్యర్థిగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తూనే ప్రతి నియోజకవర్గంలో పార్టీ విజయం సాధించేలా ప్రణాళికను రూపొందిస్తాం. ఇప్పటికే ఖమ్మంజిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మారింది. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయాలు సాధించడం ద్వారా ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సత్తా చాటనున్నాం.
ప్ర : ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచార అస్ర్తాలేమిటి?
జవాబు : ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ఇతర రాష్ర్టాలు తెలంగాణ మోడల్ అభివృద్ధి కావాలని ఆశిస్తున్నాయి. ఆసరా పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి అనేక పథకాలను అమలుచేస్తూ ప్రతిఒక్కరికీ అండగా నిలిచింది. ఈ తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధే మా ప్రచార అస్త్రం. పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలను అర్హులకు అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. దీంతో ఇతర రాజకీయ పార్టీల సానుభూతిపరులు సైతం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎన్నికల సమయంలోనే కాదు.. నిరంతరం ప్రజలతో ఉండే పార్టీ మాది. బీఆర్ఎస్ ప్రచారం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రారంభమైనట్లే.
ప్ర : ఖమ్మం అభ్యర్థిగా మీ ఎన్నికల ప్రణాళిక?
జవాబు : జిల్లా కేంద్రమైనప్పటికీ ఖమ్మం నియోజకవర్గం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సాయంతో ఖమ్మం నగర రూపురేఖలను మార్చేశాను. జిల్లాకేంద్రంలో ఐటీ హబ్, గోళ్లపాడు ఛానల్ సంస్కరణ, మున్నేరు బ్రిడ్జిపై రూ.180 కోట్లతో తీగల వంతెన, లకారం ట్యాంక్బండ్, మున్నేరు వరద నీటి నుంచి ఖమ్మం ప్రజలను శాశ్వతంగా రక్షించేందుకు రాతికట్టల నిర్మాణం, అభివృద్ధి పనులకు భారీగా నిధుల మంజూరు వంటి బృహత్తర కార్యక్రమాలు కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సాధ్యమయ్యాయి. జిల్లాకేంద్రానికి వైద్యకళాశాల మంజూరుకావడంతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందించే అవకాశం లభించింది. ఈ సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. ప్రజల ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సత్వరం పరిష్కరించే కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతున్నది. ఖమ్మం ప్రజలు నన్ను ఓ కుటుంబసభ్యుడిగా ఆదరిస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లోనూ విజయం ఖాయం.
ప్ర : ఏ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది?
జవాబు : బీఆర్ఎస్ పార్టీకి ఆది నుంచి కాంగ్రెస్ పార్టీయే ప్రధాన పోటీ. కాంగ్రెస్ పార్టీకి గతంలో అనేకసార్లు ప్రజలు అవకాశం ఇచ్చినా జిల్లా అభివృద్ధికి పాటుపడని చరిత్ర వారిది. దీంతో ప్రజల్లో కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత ఉంది. నిరంతరం అభివృద్ధిని ఆకాంక్షించే పార్టీ బీఆర్ఎస్. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో అన్ని శాసనసభ స్థానాల్లో మా పార్టీయే విజయం సాధిస్తుంది. రాజకీయ వ్యహరచనలో కేసీఆర్ను మించిన వ్యూహకర్త లేరు. ఏ రాజకీయ పార్టీ చేయని సాహసాన్ని చేశారు.. మూడునెలల ముందే అభ్యర్థులను ప్రకటించడం సీఎం కేసీఆర్కే సాధ్యమైంది. దీంతో రాజకీయపక్షాల్లో ఆందోళన ప్రారంభమైంది. ప్రధాన రాజకీయపక్షాల నుంచి ఎవరు ఎక్కడ నుంచి పోటీచేసినా ఇబ్బందిలేదు.. ప్రజలు బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు. ఎన్నికల కోసం వచ్చేవారిని ఆదరించే సంస్కృతి ఖమ్మంజిల్లా ప్రజలకు లేదు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయం. ఖమ్మం నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త సుశిక్తులైన సైనికుల వలే ఎన్నికల కార్యరంగంలోకి దూకేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు పూర్తిస్థాయి సమయం ఉన్నందున ప్రతి ఇంటిని, ప్రతి ఓటరును కనీసం మూడుసార్లు కలిసి అభివృద్ధిని వివరించేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నాం.