రఘునాథపాలెం, డిసెంబర్ 13: రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టిందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో 50 మందికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి పాలనలో పేదలు తమ బిడ్డల పెళ్లిళ్లు చేయాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. ఉద్యమ సమయంలోనే దీనిపై సుదీర్ఘ ఆలోచనలు చేసిన కేసీఆర్.. తెలంగాణ ఆవిర్భవించి తాను ముఖ్యమంత్రి అయ్యాక కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టారని వివరించారు.
ఈ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు మేనమామ రూపంలో సాయం అందిస్తున్నారని గుర్తుచేశారు. ఈ పథకాల కింద నియోజకవర్గంలో 7,564 మందికి రూ.70.70 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించినట్లు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొద్దిసేపు ఉర్దూలో మాటాడి ముస్లింలను ఆకట్టుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోని ముస్లింలపై కేంద్రం కక్ష కట్టిందని, వారిని దేశం నుంచి వెళ్లగొట్టేందుకు మతతత్వ ప్రచారాలను చేస్తోందని విమర్శించారు. మేయర్ నీరజ, తహసీల్దార్లు శైలజ, నర్సింహారావు, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, సుడా చైర్మన్ విజయ్కుమార్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
గురుకులాల వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందిస్తున్నదని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రం రఘునాథపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యోతిబా పూలే బీసీ మహిళా డిగ్రీ కళాశాలను కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ గురుకులాల ద్వారా కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను పేదల చెంతకు చేర్చినట్లు చెప్పారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థికి సగటున రూ.1.15 లక్షలను ప్రభుత్వం వెచ్చిస్తున్నట్లు వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకలు బచ్చు విజయ్కుమార్, పునకొల్లు నీరజ, గుడిపుడి శారద, కుందేసాహెబ్, లక్ష్మణ్నాయక్, చెన్నబోయిన సైదులు, నంద్యా, తాతా రఘురాం తదితరులు పాల్గొన్నారు.