ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ ఖమ్మం, మే 22: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటలు పిట్టలదొరను తలపిస్తున్నాయి. డబ్బు అహంకారంతో ఏదైనా సాధించగలనని, అభివృద్ధిని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ బచ్చా అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఫైర్ అయ్యారు. సోమవారం ఖమ్మం నగరంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. సీఎం కప్ పోటీల్లో భాగంగా సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లాస్థాయి ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి క్యాంప్ కార్యాలయంలో 91 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.91.10 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొంగులేటి కాంట్రాక్టర్గా ఎన్నో కాలువల నిర్మాణాలు పూర్తి చేయకుండానే వందలాది కోట్ల రూపాయలను కొల్లగొట్టారని ఆరోపించారు.
ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ బచ్చా అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని మంత్రి క్యాప్ కార్యాలయంలో సోమవారం 91 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.91.10 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. పొంగులేటి వెదజల్లాలనుకున్న డబ్బులు జిల్లా ప్రజల ఎడమకాలి చెప్పుతో సమానమన్నారు. ఖమ్మం నగరం హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి సాధించిందని, కళ్లు ఉండి కూడా పొంగులేటి అభివృద్ధిని చూడలేకపోతున్నారని మండిపడ్డారు. నగరాభివృద్ధిపై కడుపు నిండా విషం పెట్టుకున్నారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండదండలతోనే పొంగులేటి ఎదిగారని అన్నారు. నిన్నమొన్నటి వరకు గులాబీ జెండా కింద బతికి ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ను విమర్శిస్తున్నారన్నారు.
పొంగులేటి వద్ద పాపపు సొమ్ము పేరుకుపోయిందన్నారు. కాంట్రాక్టర్గా ఎన్నో కాలువల నిర్మాణాలు పూర్తి చేయకుండానే వందలాది కోట్ల రూపాయిలను కొల్లగొట్టారని ఆరోపించారు. పొంగులేటి ఆగడాలపై తన పాలోడే ఫిర్యాదు చేసిన సంగతి గుర్తులేదా.. అని ప్రశ్నించారు. చిన్న కాంట్రాక్టర్లు త్వరలోనే పొంగులేటి మోసాల చిట్టాను బయటపెట్టనున్నారన్నారు. తాను రాజకీయాలను చాలెంజ్గా తీసుకుని వచ్చానని, పువ్వాడ కుటుంబం గురించి యావత్ ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసునన్నారు. సిండికేట్ రాజకీయాలకు కేంద్రం పొంగులేటి అన్నారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కార్పొరేట్ అభ్యర్థులు ఓడిపోవడానికి వారికి ప్రత్యర్థులకు డబ్బు పంచారని ఆరోపించారు. నేడు పిట్టల దొరలా వచ్చి సూక్తులు వల్లిస్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. పొంగులేటి పక్కన తిరిగే వారంతా దొంగలు, రౌడీషీటర్లేనన్నారు. మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, వలరాజు, మక్బుల్, పాలేపు విజయ, రుద్రగాని శ్రీదేవి, గజ్జల లక్ష్మి పాల్గొన్నారు.
ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా ‘కల్యాణలక్ష్మి’
ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా ‘కల్యాణలక్ష్మి’ అని మంత్రి అజయ్ అన్నారు. కల్యాణలక్ష్మి వంటి పథకం మరే రాష్ట్రంలోనూ లేవన్నారు. గతంలో పేద, మధ్యతరగతి వర్గాలు ఆడపిల్లల పెండ్లి చేయాలంటే అప్పు చేయాల్సి వచ్చేదని, కల్యాణలక్ష్మి అమలైన తర్వాత ఆ బాధ లేకపోయిందన్నారు. పథకం కింద ఇప్పటివరకు ఖమ్మం నియోజకవర్గంలో రూ.78.21 కోట్ల నిధులు అందించామన్నారు.