ఖమ్మం :ఖమ్మం నగర ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, పండ్లు, మాంసాహారం, చేపలు తదితరుల నిత్యావసర వస్తువులు అన్ని ఒకే చోట అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందుకు తగు చర్యలు చేపట్టారు. ఖమ్మం నగరం దినదినా భివృద్ధిచెందుతున్న తరుణంలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సమీకృత వెజ్, నాన్వెజ్మార్కెట్ను ఆధునాతనంగా నిర్మించనున్నారు.ఖమ్మం నగరంలోని ఖానాపురంలో రూ.4.50 కోట్లు, వీడిఓస్ కాలనీలో రూ.4.50 కోట్లతో నిర్మించ తలపెట్టిన సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను బుధవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మేయర్ పునుకొల్లు నీరజ గారితో కలిసి పరిశీలించారు.
ఖానాపురం, వీడిఓస్ కాలనీ లోని ఒక్కో మార్కెట్ నకు 2.01 ఎకరాల్లో నిర్మిస్తున్న సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ లో 65 వెజ్ స్టాల్స్, 23ఫ్రూట్ స్టాల్స్, 46నాన్-వెజ్ స్టాల్స్ మొత్తం-134 స్టాల్స్ తో అన్ని సౌకర్యాలు ఒకే చోట ప్రజలకు కావలసినవి అందుబాటులో ఉండనున్నాయి. ఆయా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి గారికి, సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. రద్దీని నివారించేందుకు మార్కెట్ కు వచ్చే వారికి, ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవకాశం ఉన్న అన్ని వైపులా రోడ్డు అనుసంధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్కెట్ నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా చూడలని, ఈ సందర్భంగా మార్కెట్ ప్లాన్ మ్యాప్ను మంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు.