ఖమ్మం:కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంపై గోవాలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం బయలుదేరి వెళ్లారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించే మార్గాలపై కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, పరిశ్రమల రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, సాంకేతిక నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) నూతన పాలసీని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి 2020-2030నికి ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన విధానాలను వెల్లడించారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్ హబ్ గా మార్చే ప్రణాళికలో భాగంగా నూతన విధానాలను రూపొందించి తాజా విధానాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది.
రాష్ట్రంలో కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి పలు రాయితీలు ఇస్తున్నది. ఈ సమావేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, విధివిధానాలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించనున్నారు.