మామిళ్లగూడెం, జనవరి 21: అభివృద్ధి పనులపై అధికారులు నిత్యం పర్యవేక్షణ ఉండాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆదివారం పాలేరు నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి నియోజకవర్గ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగేలా మెలగాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండాలన్నారు. హెల్త్ సబ్ సెంటర్ల నిర్వహణ పక్కాగా ఉండాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను పటిష్ట పరచాలని, ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని డీఈవో సోమశేఖరశర్మను ఆదేశించారు ఖమ్మం రూరల్లో నర్సింగ్ కళాశాల భవనాన్ని నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలన్నారు. తిరుమలాయపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 పడకల నుంచి 100 పడకలకు అప్ గ్రేడ్ అయిందని, అందుకు అనుగుణంగా ఆసుపత్రిలో వసతులు కల్పించాలని, నేలకొండపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆపరేషన్ థియేటర్, కాంపౌండ్ వాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.
పాలేరు కెనాల్ మెయిన్ అప్ స్ట్రీం, డౌన్ స్ట్రీం భూములకు డీమార్క్ చేసి, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నాయకన్గూడెంలో ఐబీ విశ్రాంతి గృహ నిర్మాణానికి టెండర్ రీకాల్ చేయాలని సూచించారు. ఎన్ఎస్పీ, ఎస్సార్ఎస్పీ పనుల పురోగతిపై నివేదిక సమర్పించాలన్నారు. పెద్దతండా, ఏదులాపురం, గుదిమళ్ల్ల, చిన్నవెంకటగిరి గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై నివేదిక ఇవ్వాలన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. గట్టు సింగారం, ముజ్జుగూడెంలలో శిథిలావస్థకు చేరిన పశు వైద్యశాలల స్థానంలో కొత్త భవనాలు నిర్మించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. పాలేరు నియోజకవర్గంలో మినీ స్టేడియం నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. మద్దులపల్లి మారెట్ పనులను జూలైలోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, డి.మధుసూదన్నాయక్, ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్సింగ్ పాల్గొన్నారు.