ఖమ్మం, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం పంపిన రూ.కోటి ప్రత్యేక నిధులతో భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణమహోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించామని, ఇదే రీతిలో శుక్రవారం పుష్కర పట్టాభిషేకాన్నీ ఇంతే వైభవంగా పూర్తి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. ఈ మహోత్సవాలను ఘనంగా నిర్వహించే అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
భద్రాచలంలో గురువారం జరిగిన శ్రీసీతారాముల కల్యాణమహోత్సవంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా భావిస్తోందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా అన్ని చర్యలూ తీసుకున్నామని అన్నారు.
ఈ కల్యాణ మహోత్సవంలో భక్తులు లక్షలాదిగా పాల్గొన్నారని అన్నారు. కరోనా అనంతరం ఈ ఏడాదే భక్తులు పెద్ద సంఖ్యలో హాజరైనట్లు వివరించారు. భద్రాచలంలో ప్రసాదాలు, తలంబ్రాల పంపిణీకి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామని, ఎక్కడా ఆటంకాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు.
మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.. ఎంపీగా భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి తనవంతు కృషిచేస్తున్నానని, దేవస్థానం అభివృద్ధి గురించి ఇప్పటికే పార్లమెంట్లో పలుమార్లు ప్రస్తావించి కేంద్రం నుంచి పలు పథకాలను వర్తింపచేసేలా కృషిచేశానని వివరించారు. భవిష్యత్లోనూ భద్రాచలం ప్రాంత ప్రజలకు అండగా ఉంటామని, పోలవరం వల్ల తలెత్తే భద్రాచలం ముంపు సమస్యను మరోసారి పార్లమెంట్లో ప్రస్తావిస్తానని అన్నారు.