రఘునాథపాలెం, మే 31: ‘దక్షిణాదిలో బీజేపీకి ఇక పుట్టగతులు ఉండవ్.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులే లేరు.. బీఆర్ఎస్ను, ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకొని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్థికంగా ఎదిగారు.. ఇప్పుడు సీఎం కేసీఆర్ను గద్దె దించుతానంటూ ఉత్తరకుమారుడి మాటలు మాట్లాడుతున్నారు.. ఆయన అనుచరులతో నాపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారు.. ఎన్ని కుట్రలు పన్నినా ‘గులాబీ’ని పడగొట్టలేరు.. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది.. మళ్లీ బీఆర్ఎస్దే విజయం..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. రఘునాథపాలెం మండలం చిమ్మపూడిలో బుధవారం నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. పొంగులేటికి మున్ముందు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ జరగని అభివృద్ధి జిల్లాలో కేవలం గడిచిన తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలోనే జరిగిందని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలను చూసి కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. పార్టీని, ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఆర్థికంగా ఎదిగిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వం, తనపైనా అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దించుతామంటూ, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ ఉత్తరకుమార ప్రగల్బాలు పలుకుతున్నారని మండిపడ్డారు. డబ్బు, అహంతో ప్రజల ఆత్మాభిమానాలను కొనలేరనే విషయాన్ని గుర్తించాలని హితవు చెప్పారు. కాంట్రాక్టర్గా అడ్డదారుల్లో కోట్లకు పడగలెత్తిన పొంగులేటి.. అతడి అనుయాయులతో తనపై తప్పుడు ప్రచారాలను చేయించే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. దీనిని బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు సహించరని అన్నారు.
బీజేపీకి పుట్టగతుల్లేవు..
డబుల్ ఇంజిన్ సర్కారుగా చెప్పుకుంటున్న బీజేపీకి తెలంగాణలో దిక్కులేని పరిస్థితులే ఉన్నాయని విమర్శించారు. దక్షిణ భారతదేశంలో ఆ పార్టీకి పుట్టగతులుండవని అన్నారు. కాంగ్రెస్కు 60 స్థానాల్లో అభ్యర్థులే లేరని విమర్శించారు. కర్ణాటకలో బీజేపీ పూర్తిగా విఫలం కావడం, ప్రజలకు మరో అవకాశం లేకపోవడం వల్లనే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ను ఆదరించారు తప్ప మరో కారణమేమీ లేదని అన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తాను తెచ్చుకున్న కరెన్సీ నోట్లను రెండుసార్లు రద్దు చేసి చరిత్ర సృష్టించారని విమర్శించారు.
ఎన్నికలకు సమాయత్తం కావాలి..
అసెంబ్లీ ఎన్నికలకు ఐదు నెలల సమయం మాత్రమే ఉన్నందున బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ఉండి పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏకబికిన అత్యధిక రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీఎంగా కేసీఆర్ దేశంలో చరిత్రను సృష్టించపోతున్నారని అన్నారు. అదే క్రమంలో వచ్చే ఎన్నికల్లో మూడోసారీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి చరిత్రను తిరగరాయబోతున్నట్లు చెప్పారు. ఇందుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని, అందించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని శ్రేణులకు సూచించారు. ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాలను కైవసం చేసుకునేలా శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. వైస్ ఎంపీపీ గుత్తా రవి అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు భూక్యా గౌరి, అజ్మీరా వీరూనాయక్, మద్దినేని వెంకటరమణ, కుర్రా భాస్కర్రావు, పిన్ని కోటేశ్వరరావు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మాదంశెట్టి హరిప్రసాద్, గొర్రె కృష్ణవేణి, కాంపాటి రవి, గంగిరెడ్డి విజయ్రెడ్డి, దొంతు సత్యనారాయణ, గొర్రె శ్రీనివాసరావు, నున్నా శ్రీనివాసరావు, చెరుకూరి పూర్ణ, చెరుకూరి భిక్షమయ్య, గుండ్ల ముత్తయ్య, లక్ష్మణ్నాయక్, ఉయ్యూరు వెంకటనారాయణ, చెన్నబోయిన సైదులు, కొర్లపాటి రామారావు, రామా వెంకటేశ్వర్లు, తోట వెంకట్, దేవేందర్, పగిళ్ల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.