భద్రాచలం/ చర్ల/ సారపాక/ పర్ణశాల, జూలై 19: భారీ వర్షాలు కురుస్తుండడం, గోదావరికి వరద పెరుగుతుండడంతో రానున్న 72 గంటలు ఎంతో కీలకమని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని లోతట్టు ప్రాంతాలను బుధవారం ఆమె పరిశీలించారు. అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తుండడం, వరదలు వస్తుండడంతో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. భద్రాచలం వద్ద గంటగంటకు గోదావరి వరద నీటిమట్టం పెరుగుతున్నందున అధికారులు అన్ని వేళలా అప్రమత్తంగా, అందుబాటులో ఉండాలని సూచించారు. వరద నీటిమట్టం ఏమాత్రం పెరిగినా లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.
అత్యవసర సేవల కోసం 24 గంటలూ పనిచేసేలా జిల్లాలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే 08744-241950, 9392919750, 08743-232444 నెంబర్లను గానీ, లేదా 9392919743, 7981219425 నెంబర్లలో వాట్సప్ ద్వారా గానీ సంప్రదించాలని సూచించారు. అంబులెన్స్లు, మందులు, ఆర్బీఎస్కే వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ఈ నెలలో 129 మంది, వచ్చే నెలలో 518 గర్భిణులు ఉన్నట్లు గుర్తించామని, వారిని ముందస్తుగా ఆసుపత్రుల్లో చేర్పించాలని ఆదేశించారు. రానున్న ఐదు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అంతకుముందు కొర్రాజుల గుట్టలోని నన్నపనేని మోహన్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆమె పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం విస్తా కాంప్లెక్స్ మురుగునీటిని తోడే యంత్రాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ కర్నా టి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పరితోష్ పంకజ్, రత్నకల్యాణి, రమాకాంత్, భీమ్లా, శిరీష, డాక్టర్ రవిబాబు, శ్రీనివాస్, మల్లికార్జున్, పురందర్ తదితరులు పాల్గొన్నారు.
34 అడుగులకు చేరిన గోదావరి
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. బుధవారం ఉదయం 7 గంటలకు 24.4 అడుగులు ఉన్న గోదావరి 10 గంటలకు 26.8 అడుగులకు, మధ్యాహ్నం 12 గంటలకు 28 అడుగులకు, 2 గంటలకు 29.8అడుగులకు, 3 గంటలకు 30.7 అడుగులకు, సాయంత్రం 4 గంటలకు 31.5 అడుగులకు, 5 గంటలకు 32 అడుగులకు, రాత్రి 7 గంటలకు 33.7 అడుగులకు, 8 గంటలకు 34 అడుగులకు చేరుకుంది. రాత్రికి 35 అడుగులకు చేరవచ్చని కలెక్టర్ ప్రియాంక తెలిపారు.
వర్షాలపై మంత్రి అజయ్ టెలీ కాన్ఫరెన్స్ గోదావరి, మున్నేరు వరదలపై ఆరా
ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలు, వస్తున్న వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అజయ్కుమార్ సూచించారు. ఈ మేరకు ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లతో బుధవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముందుగా లోతట్టు ప్రాంతాల వారిని గుర్తించాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో వరద ఏమాత్రం పెరిగినా ముందుగా లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా అదనపు సిబ్బందితోపాటు పడవలు, లైఫ్ జాకెట్లు, రెస్క్యూ టీములను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఖమ్మంలోని మున్నేరు పరీవాహకంలో కూడా అధికారులు అలెర్ట్గా ఉండాలని ఆదేశించారు.
మరో రెండు రోజులు విధుల్లోనే ఉండాలి: ప్రభుత్వ విప్
భారీ వర్షాలు కురుస్తుండడం, గోదావరికి వరద పెరుగుతుండడంతో పరీవాహక ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మరో రెండు మూడు రోజులపాటు కార్యస్థానాల్లో విధుల్లోనే ఉండాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సూచించారు. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడం, మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మణుగూరు మండలంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. కాలినడకన వెళ్లి లోతట్టు ప్రాంతాలను పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. అలావే వర్షాలు, వరదలు తగ్గే వరకూ విధుల్లోనే ఉండాలంటూ అధికారులను ఆదేశించారు.