ఖమ్మం కమాన్బజార్, మార్చి 23: రాబోయే ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఓడించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఇందుకోసం అందరమూ కలిసికట్టుగా ఉండాలని అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్ర గురువారం ఖమ్మం నగరానికి చేరుకుంది. మంత్రి అజయ్కుమార్ ఈ యాత్రకు సంఘీభావం తెలిపి.. గాంధీచౌక్లో నిర్వహించిన సభలో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. వామపక్షాలకు స్వార్థం ఉండదని, కమ్యూనిజం అజరామరమని అన్నారు. ఈ రోజు సీఎం కేసీఆర్ బోనకల్లు మండలంలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారని, తమ ఆహ్వానం మేరకు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు పాల్గొని పలు సూచనలు చేశారని అన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కారు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలనూ భ్రష్టు పట్టిస్తోందని విమర్శించారు. వామపక్షలు ఎటువైపు ఉంటే అటువైపు విజయం ఉంటుందని అన్నారు. ప్రధాని మోదీ తన అనుచరుడి కోసం దేశ సంపదనంతా ఏకమొత్తంగా అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే వారిపైకి వ్యవస్థలను, సంస్థలను ఉసిగొల్పుతున్న ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని అన్నారు. మొన్న జరిగిన మునుగోడు ఉప ఎన్నికలోనూ బీజేపీని అడ్డుకున్నామని గుర్తుచేశారు. నగరంలో ఇటీవల నిర్మించిన పార్కులకు కమ్యూనిస్టు నేతల పేర్లను పెట్టామని వివరించారు.
బీజేపీని గద్దె దింపుదాం: తమ్మినేని
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ సాగిస్తున్న ఆగడాలతో దేశం రావణకాష్టంగా మారుతోందని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీని గద్దె దింపుదామని అన్నారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ.. వారి వెన్నెముక విరిచేలా దుర్మార్గమైన మూడు చట్టాలను తెచ్చారని విమర్శించారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాగం హేమంతరావు మాట్లాడారు. ఈ సభలో సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, బీఆర్ఎస్ నగర ఆధ్యక్షుడు పగడాల నాగరాజు, సీపీఎం, సీపీఐ నాయకులు నున్నా నాగేశ్వరరావు, పోటు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
‘పోడు’ పట్టాలు ఇస్తామనడం సంతోషదాయకం
ఖమ్మం రూరల్, మార్చి 23: పోడు భూములకు పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం సంతోషదాయకమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీఆర్ఎస్తో చర్చలు జరుగుతున్నాయని, రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్ర గురువారం ఖమ్మం రూరల్ మండలానికి చేరుకుంది. ఎం.వెంకటాయపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ ఎన్నికలకు ముందు హామీనిచ్చి గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం.. ఆ తరువాత నిరుద్యోగులను మోసం చేసిందని దుయ్యబట్టారు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో చివరికి ప్రధాని మోదీ ఓడిపోయారని, రైతులు విజయం సాధించారని అన్నారు.