ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 5: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో దశాబ్దాల తరబడి వేరొకరి పేరుతో వ్యాపారాలు చేసే వారి చిరకాల వాంఛ ఒకటి రెండు రోజుల్లో తీరబోతోంది. దీంతో సదరు వ్యాపారుల ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. సుమారుగా ఎనిమిది దశాబ్దాల క్రితం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఏర్పడింది. ప్రారంభంలో కొన్నేళ్లపాటు రాష్ట మార్కెటింగ్శాఖ అడ్తీ (కమీషన్) లైసెన్సులను జారీ చేసింది. అనంతరం లైసెన్సుల జారీకి బ్రేక్ పడింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతోపాటే ఏటికేడు మార్కెట్కు పంట ఉత్పత్తులు రాక, రైతుల తాకిడి అదే స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే రైతులకు అనుగుణంగా లైసెన్సులు కలిగిన వ్యాపారులు లేకపోవడంతో సదరు రైతులు పంటను దళారుల ద్వారానే విక్రయించుకోవాల్సిన వస్తోంది. దీంతో ఈ పరిస్థితిని గమనించిన నాటి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చరిత్రలో తొలిసారిగా 2016లో 125 మంది వ్యాపారులకు అడ్తీ లైసెన్స్లను మంజూరయ్యాయి. దీంతో అటు రైతులకు, ఇటు వ్యాపారులకు కలిసి ప్రయోజనం కలిగినట్లయింది. అయితే మార్కెట్ విస్తీర్ణం లేకపోవడంతో మిగిలిన వ్యాపారులకు లైసెన్సులు జారీ కాలేదు.
మరో 150 మందికి లైసెన్సులు..
వర్తక సంఘం పరిధిలోని దిగుమతి, ఎగుమతి శాఖ వ్యాపారుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని మంత్రి అజయ్ నూతన అడ్తీ లైసెన్సులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. అది కూడా అర్హులకు మాత్రమే, నిబంధనల ప్రకారమే అవకాశం కల్పించాలని ఏఎంసీ అధికారులకు, పాలకవర్గ బాధ్యులకు దిశా నిర్దేశం చేశారు. దీంతో ఏఎంసీ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత వ్యాపారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మంగళవారం నాటికి సుమారు 450 మంది వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి కొద్దిరోజుల్లోనే అర్హులైన వ్యాపారులకు లైసెన్సులు అందజేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
మంత్రి పువ్వాడ చొరవతో పెరిగిన మార్కెట్ విస్తీర్ణం
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కోసం నిత్యం తపనపడే మంత్రి అజయ్కుమార్ యార్డుల విస్తీర్ణంపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో కొద్ది నెలలుగా త్రీటౌన్ పర్యటనకు వచ్చిన ప్రతిసారీ యార్డుల్లో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. మార్కెట్ విస్తీర్ణం పెంపు నిమిత్తం యార్డుల్లోని పురాతన భవనాలను తొలగించాలని ఆదేశించారు. దీంతో మార్కెట్ కమిటీ పురాతన భవనాలను తొలగించడంతో యార్డుల్లో విస్తీర్ణం పెరిగింది. అదే ప్రాంతంలో భారీ షెడ్ల నిర్మాణ షెడ్లు ప్రారంభమయ్యాయి. దీంతో నూతనంగా అడ్తీ లైసెన్సుల జారీకి మార్గం సుగమమైంది. ఏటేటా పెరుగుతున్న రైతుల సంఖ్య, వ్యాపారుల విజ్ఞప్తి మేరకు మరోసారి అడ్తీ లైసెన్సులు జారీ చేసేందుకు అవకాశం కలిగింది.
వందలాది కుటుంబాల ఉపాధికి భరోసా
నూతన అడ్తీ లైసెన్సుల జారీ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా లైసెన్సు కలిగిన వ్యాపారుల సాయంతో పంటలను విక్రయించుకోవచ్చు. తద్వారా అమ్ముకుంటున్న పంటకు ఆర్థిక భరోసా ఉంటుంది. దీంతోపాటు మరింత మంది కార్మికులకు ఉపాధి లభిస్తుంది. యార్డుల విస్తీర్ణం పెంపు, నూతన లైసెన్సుల జారీ కోసం కృషి చేసిన మంత్రి అజయ్కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
-దోరేపల్లి శ్వేత, ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్
తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి పువ్వాడకు కృతజ్ఞతలు
వ్యాపారుల ఇబ్బందుల దృష్ట్యా అడ్తీ లైసెన్సుల మంజూరుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, కృషి చేసిన మంత్రి అజయ్కుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తెలంగాణ ఏర్పడిన తరువాత మరోసారి లైసెన్సులు జారీ కాబోతున్నాయి. మార్కెట్లో సుదీర్ఘ కాలంగా వందలాది మంది వర్తకులు వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే వారి పేరుపై లైసెన్సులు లేకపోవడాన్ని మంత్రి గమనించి లైసెన్సులు ఇవ్వనుండడం సంతోషకరం.
-చిన్ని కృష్ణారావు, ఖమ్మం వర్తక సంఘం అధ్యక్షుడు