తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 27: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ పల్లెసీమల్లో ప్రగతి వెలుగులు విరజిమ్ముతున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో కరువు ప్రాంతాల్లో ప్రజల కష్టాలు తొలగిపోయాయని అన్నారు. తిరుమలాయపాలెం మండలంలో బుధవారం పర్యటించిన ఆయన.. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డితో కలిసి పిండిప్రోలు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత పిండిప్రోలు – చిలకొయ్యలపాడు మధ్య రూ.2 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్, గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. ఉచిత విద్యుత్, రైతుబంధు వంటి అద్భుత పథకాలతో అన్నదాతల ఆర్థిక పరిపుష్టికి నాంది పలికిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. అద్భుత పథకాలు అమలు చేస్తూ రాష్ర్టాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలందరూ అన్ని విధాలా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు బోడ మంగీలాల్, శేషగిరిరావు, నల్లమల్ల వెంకటేశ్వరావు, చావా వేణు, వైస్ చేర్మేన్ చామకూరి రాజు, నామా ప్రసాద్, పులుగుజ్జు వెంకటేశ్వర్లు, బాషబోయిన వీరన్న, దేవరం దేవేందర్రెడ్డి, చుంచు శ్రీనివాసరావు, రాంప్రసాద్ పొల్గొన్నారు.
ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి రైతులకు పూర్తిస్థాయిలో సాగునీటి అందించి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నట్లు వివరించారు. కరువు ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలం కూడా తెలంగాణ పాలనలో కోనసీమను తలపిస్తుండడం సంతోషకరమని అన్నారు.
ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. తిరుమలాయపాలెం మండలంలో సాగు, తాగు నీటి కష్టాలను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి ఈ ప్రాంతంలో సాగు నీటి కష్టాలను తొలగించారని గుర్తుచేశారు.
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో సీతారామ ప్రాజెక్టు కాలువ డిజైన్ మార్పు చేయించి రైతులు 600 ఎకరాల సాగు భూములు కోల్పోకుండా కృషిచేసినట్లు చెప్పారు. పిండిప్రోలు గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రజల విజప్తి మేరకు పిండిప్రోలు-చిలకొయ్యలపాడు బీటీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేయిస్తామన్నారు.