కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. లబ్ధిదారుల ఇంటికే వెళ్లి ఆ చెక్కులను అందించి వారికి తన వంతుగా చీరె సారెను బహూకరించే వినూత్న పంథాకు నాంది పలికారు. మంజూరైన చెక్కులన్నింటినీ ఎప్పటికప్పుడు లబ్ధిదారుల ఇంటికెళ్లి అందిస్తూ అక్కడే వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులందరూ సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 7,564 మందికి రూ.70.71 కోట్ల లబ్ధి చేకూరింది.
– ఖమ్మం, జనవరి 8
ఖమ్మం, జనవరి 8:స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి ఇప్పటి దాకా అటు దేశంలో నూ, ఇటు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నో ప్రభుత్వాలు కొలువుదీరాయి. పదవీకాలం ముగిశాక మూటాముల్లె సర్దుకున్నాయి. ఆ అన్ని ప్రభుత్వాల్లోనూ ఎందరో పెద్దలు ఎమ్మెల్యేలుగానూ, మంత్రులుగానూ పనిచేశారు. కానీ వారిలో మరెవ్వరూ చేయని సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు ఖమ్మం ఎమ్మెల్యే అయిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్. అదే ‘లబ్ధిదారుల ఇంటికే ప్రభుత్వ ఫలం.’ ఈ వినూత్న ఆలోచనను తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గం నుంచే ప్రారంభించారు. అందులోనూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో చేపట్టిన ఈ పంథా విశేష ఆదరణ చూరగొంటోంది. ఇందుకు అదనంగా తన సొంత ఖర్చులతో చీరెను కూడా సారెగా అందిస్తూ నవ వధువులందరికీ మేనమామలా అండగా నిలుస్తున్నారు. పైగా డివిజన్లలో చెక్కులు పంపిణీ చేశాక అక్కడి లబ్ధిదారులందరితో ఆ డివిజన్లోనే సహఫంక్తి భోజనాలూ చేస్తున్నారు. వారితో మమేకమవుతున్నారు. లబ్ధిదారుల ఇంటికే వెళ్లి ప్రభుత్వ ఫలాలు అందించడం ద్వారా కొత్త చరిత్రకు నాంది పలికిన అజయ్కుమార్ ఇతర ప్రజాప్రతినిధులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే పేదలు ఒకప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి ఉండేది. కానీ మంత్రి అజయ్ అలాంటి ఇబ్బందులకు చరమగీతం పాడారు. తానే స్వయంగా వెళ్లి లబ్ధిదారులకు ఆ ఫలాలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముదారక్ పథకాల కింద ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటి వరకు మొత్తం 7,564 మంది లబ్ధిదారులకు రూ.70.71 కోట్లను అందజేశారు. వీటిలో ఖమ్మం నగరంలోని 5,881 మందికి గాను రూ.55.38 కోట్లను, రఘునాథపాలెం మండలంలో 1,683 మందికి రూ.15.33 కోట్లను అందచేశారు.
పేదల ఆప్యాయత, అభిమానం చాలా గొప్పది. వారు మనస్ఫూర్తిగా చూపే ప్రేమకు నిర్వచనమే లేదు. సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టాక వాటి చెక్కులను నేనే స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేయాలని నిర్ణయించుకున్నా. దానిని అమల్లోకి తెచ్చాక అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వారి ఇళ్లకు నేను వెళితే నన్ను వారి సొంత సోదరుడిగా, మేనమామగా, కుటుంబ పెద్దగా ఆశీర్వదిస్తున్నారు. హారతులు పడుతూ స్వాగతం పలుకుతున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు తెచ్చిన సీఎం కేసీఆర్ను పేదల తమ దేవుడిలా భావిస్తున్నారు. లబ్ధిదారులందరూ తమ ఇళ్లలో సీఎం కేసీఆర్ ఫొటోలు పెట్టుకొని పూజలు కూడా చేస్తున్నారు.
-పువ్వాడ అజయ్కుమార్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి
కల్యాణలక్ష్మి పథకం కింద మంత్రి అజయ్ అన్న మాకు ఇచ్చిన చెక్కు మా కుటుంబానికి అండగా నిలిచింది. నాలాంటి పేదలందరికీ సీఎం కేసీఆర్ పెద్ద దిక్కుగా ఉన్నారు. ఈ పథకం ద్వారా అందిన రూ.లక్ష సాయం.. మా పాప వివాహానికి అయిన ఖర్చులకు ఎంతగానో అక్కరకొచ్చింది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి పథకాలు అమలు చేయలేదు. ఇంతకుమునుపు ఏ మంత్రిగానీ, ఏ నాయకుడు గానీ మా అజయ్ అన్నలాగా ఇంటికి వచ్చి చెక్కును, చీర సారెను ఇచ్చిన దాఖలాలు లేవు.
-శనిగరం ధనమ్మ, జూబ్లీపుర, ఖమ్మం
కల్యాణలక్ష్మి పథకంతో ముఖ్యమంత్రి కేసీఆరే మాకు పెద్ద దిక్కు అయ్యారు. మా పాప వివాహం అయ్యాక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో కల్యాణలక్ష్మి చెక్కును మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మా ఇంటికి తీసుకొచ్చి మరీ అందజేశారు. దీంతో మా కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. ఆ చెక్కుతో మా కుటుంబ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయాయి. ప్రభుత్వం పంపిన రూ.లక్ష చెక్కును మంత్రి అజయ్ మాకు అందించాక ఆయన మాతోనే కలిసి సహఫంక్తి భోజనం చేయడం చాలా సంతోషంగా అనిపించింది. -మాలోత్ బంగారి, చెరువుకట్ట బజార్, ఖమ్మం