మామిళ్లగూడెం, ఆగస్టు 10: బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వీఆర్ఏలకు సముచిత గౌరవం లభించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. వారిని ప్రభుత్వోద్యోగులుగా నియమించడం చరిత్రాత్మకమని అన్నారు. విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖలకు కేటాయించిన గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) నిబద్ధతగా, బాధ్యతాయుతంగా విధులను నిర్వర్తించాలని సూచించారు. జిల్లాలోని 496 మంది వీఆర్ఏలను వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా నియామిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులను స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో గురువారం ఆయన వీఆర్ఏలకు పంపిణీ చేసి మాట్లాడారు.
ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 81 ద్వారా వీఆర్ఏల విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, వార్డు ఆఫీసర్లు, రికార్డు అసిస్టెంట్లు, ఆఫీసు సబార్డినేట్లు, హెల్పర్లుగా ప్రభుత్వం నియమించినట్లు చెప్పారు. దీంతో వీఆర్ఏలకు గౌరవం పెరగడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు అందే అన్ని ప్రయోజనాలూ చేకూరుతాయని అన్నారు. ఇప్పటి వరకు రూ.11,000 గౌరవ వేతనం పొందిన వీఆర్ఏలందరూ ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా వారి పోస్టు ప్రకారం పీఆర్సీ, పే సేల్ ఆధారంగా వేతనం పొందనున్నారని అన్నారు. భవిష్యత్తులోనూ ఉద్యోగోన్నతులు పొందాలని ఆకాంక్షించారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. జిల్లాలో 610 మంది విఆర్ఏలుండగా వారిలో 61 ఏళ్లలోపు ఉన్న 496 మందిని ఇప్పుడు వివిధ శాఖలకు కేటాయిస్తున్నామని, 61 ఏళ్లు పూర్తి చేసుకున్న114 మంది డిపెండెంట్లకు త్వరలోనే కారుణ్య నియామక పత్రాలు అందిస్తామని తెలిపారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను కూడా వారి పనితీరు ఆధారంగా కమిటీ ప్రతిపాదనల మేరకు దశల వారీగా క్రమబద్ధీకరిస్తామని మంత్రి అజయ్ పేర్కొన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ గ్రామాల్లో వీఆర్ఏలు అందించిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు మాట్లాడుతూ.. తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలనేదే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శులకు కూడా పత్రాలు అందజేశారు. మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ, సుడా చైర్మన్లు కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్కుమార్, అదనపు కలెక్టర్లు అభిలాష, మధుసూదన్ నాయక్, అధికారులు శంకర్నాయక్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.