అశ్వారావుపేట టౌన్, మార్చి 18: చిరుధాన్యాలు.. ఆరోగ్య సిరులు.. అనాదిగా మానవాళి తీసుకుంటున్న ఆహారం మిల్లెట్స్(చిరు ధాన్యాలు).. మన పూర్వీకులు మనకన్న ఎక్కువ ఆయుష్షుతో బతికారంటే ఇలాంటి ‘రా ఫుడ్’నే కారణం. నేటిలా నాడు బీపీ, మధుమేహం, గుండెపోటు ముప్పు లేదు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనయానంలో ఆరోగ్య సంరక్షణ ఒక ప్రహసనంగా మారింది. మరోవైపు శరీరానికి ఎక్కువ పోషకాలు అందించే ఆహారం తీసుకోవడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి సందర్భంలో బాలింతలు, గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ఐసీడీఎస్ పూనుకున్నది.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా వారంలో రెండు రోజులు వారికి మిల్లెట్స్ ఆహారం ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు జిల్లాను పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసింది.తొలుత అశ్వారావుపేట, పాల్వంచ ప్రాజెక్ట్ల పరిధిలో కార్యక్రమాన్ని విజయవంతం చేసి జిల్లావ్యాప్తంగా విస్తరిస్తున్నది. మిల్లెట్స్లో ఉండే మాంసకృత్తులు, పీచు పదార్థాలు, జింక్, కాల్షియం, ఐరన్తో పాటు ఎన్నో సూక్ష్మ పోషకాలు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనతను నివారిస్తున్నాయి. వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేస్తున్నాయి.
జిల్లాలో అమలు ఇలా..
పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా కలెక్టర్ అనుదీప్ నీతి ఆయోగ్ నిధులతో 2021-2022లో అశ్వారావుపేట, పాల్వంచ సెక్టార్ల పరిధిలోని 100 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ప్రాజెక్ట్ ఆరంభంలో అశ్వారావుపేట మండల పరిధిలోని 52 కేంద్రాలు, పాల్వంచ మండల పరిధిలోని 48 కేంద్రాల్లో అమలు చేశారు. మెరుగైన ఫలితాలు వస్తుండడంతో 2022 సెప్టెంబర్లో మొత్తం 1,058 అంగన్వాడీ కేంద్రాలకు ప్రాజెక్ట్ను విస్తరించారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 23, 769 మంది ప్రాజెక్ట్ ద్వారా లబ్ధిపొందుతున్నారు. వీరిలో గర్భిణులు, బాలింతలు 8,828 మంది, చిన్నారులు 14,941 మంది ఉన్నారు.
కలెక్టర్ ప్రత్యేక చొరవ..
కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ప్రత్యేక చొరవ తీసుకుని మిల్లెట్స్ ఫుడ్ ప్రాజెక్ట్ను పర్యవేక్షించారు. వందశాతం విజయవంతం చేశారు. ప్రాజెక్ట్ అమలుపై ఇటీవల ఢిల్లీలో జిల్లా అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్ట్ను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయాలని సిఫార్స్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్లు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వారంలో రెండు రోజుల పాటు మిల్లెట్స్ ఆహారం అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు 100 గ్రాములు, చిన్నారులకు 50 గ్రాములను కిచిడీ రూపంలో ఇస్తున్నారు. ఆహారం తీసుకున్న వారి ఆరోగ్యం ఎంతో మెరుగుపడడంతో ప్రాజెక్ట్కు మరింత ఆదరణ పెరుగుతున్నది.
నిర్వహణపై ప్రత్యేక శిక్షణ..
మిల్లెట్ ఫుడ్ ప్రాజెక్ట్ నిర్వహణపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ అధికారులు ముందుగానే హెల్త్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, సీడీపీవోలకు శిక్షణ ఇచ్చారు. గ్రామాల్లో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులకు ప్రాజెక్ట్ గురించి వివరించారు. కేంద్రాల్లో ఫుడ్ పెస్టివల్స్ను విజయవంతం చేశారు. ఆరోగ్య సంరక్షణలో మిల్లెట్స్ ఆహార ప్రాధాన్యాన్ని చాటి చెప్పారు.
మిల్లెట్ ఆహారం బాగుంది..
అంగన్వాడీ సెంటర్లో వండి పెడుతున్న ఆహారంతో ఆరోగ్యం ఎంతో మెరుగుపడింది. ముఖ్యం గా చిరుధాన్యాలకు సంబంధించిన ఆహారం పోషకాలతో కూడినది. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు లేవు. మంచి ఆహారం అందిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– లోకాల మౌనిక, బాలింత, అశ్వారావుపేట
పైలెట్ ప్రాజెక్టును సక్సెస్ చేశాం..
మిల్లెట్ ఫుడ్ పైలట్ ప్రాజెక్ట్ అమలుకు అశ్వారావుపేట, పాల్వంచ మండలాలు ఎంపికయ్యాయి. మా పరిధిలోని అశ్వారావుపేట సెక్టార్లో ప్రాజెక్ట్ను విజయవంతం చేశాం. కేంద్రాల పరిధిలో మిల్లెట్స్ ఆహారం తీసుకున్న గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం ఎంతో మెరుగుపడింది. మిల్లెట్స్ ఆహారం తీసుకుని కేవలం మూడు నెలల్లోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించొచ్చు.
– రోజారాణి, సీడీపీవో, అశ్వారావుపేట ప్రాజెక్ట్
ప్రాజెక్ట్ విజయవంతం..
జిల్లాలో చేపట్టిన మిల్లెట్స్ ఫుడ్ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. కార్యక్రమం అమలుపై మేం ఇటీవల ఢిల్లీలో ప్రెజెంటేషన్ ఇచ్చాం. ప్రాజెక్ట్ను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఫార్సు చేశాం. ప్రాజెక్ట్ విజయవంతానికి కలెక్టర్ అనుదీప్ ఎంతో సహకరించారు. ఇక నుంచి ఏడాది పొడవునా ప్రాజెక్ట్ను అమలు చేస్తాం.
– బి.మోహన్, డిస్ట్రిక్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్, కొత్తగూడెం