తిరుమలాయపాలెం, ఫిబ్రవరి 22 : ఎన్నో ఏళ్లుగా కరువుపీడితంగా కొనసాగిన తిరుమలాయపాలెం మండలం నేడు కడుపునింపే ప్రాంతంగా విరాజిల్లుతోంది. సాగునీటి వనరులు లేక, సరైన పనులు లభించక నాడు హైదరాబాద్, సూరత్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన ఇక్కడి ప్రజలు.. ఇప్పుడు దేశంలోని అనేక రాష్ర్టాల ప్రజలకు ఆశ్రయమిస్తున్నారు.
కూలి పనులు కల్పించి బతుకుదెరువునిస్తున్నారు. స్వరాష్ర్టాన్ని సాధించిన తెలంగాణ సారథి కేసీఆర్.. పదేళ్లనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో కరువుకాటకాలను రూపుమాపాలని సంకల్పించారు. ఇందులో భాగంగానే కరువుపీడిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అప్పటికే కరువు మండలంగా కునారిల్లుతున్న తిరుమలాయపాలెంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. మిషన్ కాకతీయ పథకంలో చెరువులు, కుంటలను అభివృద్ధి చేసిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మించి ఈ ప్రాంతంలో జలసిరులు పారించారు. కరువు నేలను కోనసీమలా తీర్చిదిద్దిన ఘనత సాధించారు.
ఉపాధి కోసం నాడు ఇక్కడి నుంచి అనేక మంది ప్రజలు వలస వెళ్తున్న దృశ్యాలు సాక్షాత్కరించేవి. కానీ.. నేడు ఇదే తిరుమలాయపాలెం మండలంలోని ఏ గ్రామంలో చూసినా ఇతర రాష్ర్టాలకు చెందిన కూలీలే కనిపిస్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కూలీలు వలస వచ్చి ఇక్కడి రైతుల మిర్చి తోటల్లో పనులు చేస్తున్నారు. మండల కేంద్రమైన తిరుమలాయపాలెంతోపాటు కొక్కెరేణి, తాళ్లచెరువు, పిండిప్రోలు, దమ్మాయిగూడెం, జూపెడ, బచ్చోడు, బీరోలు వంటి గ్రామాల్లోని మిర్చి తోటల్లో సుమారు 2,000 మందికి పైగానే ఇతర రాష్ర్టాల కూలీలు మిరపకాయలు కోస్తూ బతుకుదెరువు వెళ్లదీసుకుంటున్నారు.
ఉమ్మడి పాలనలో ఉన్న తిరుమలాయపాలెం మండలానికీ, నేటి స్వరాష్ట్రంలోని తిరుమలాయపాలెం మండలానికీ ఎంతో వ్యత్యాసం స్పష్టంగా కన్పిస్తోంది. సాగునీటి అవకాశాలులేక దుర్భరంగా ఉండేది ఇక్కడి రైతుల దుస్థితి. సాగునీరు వనరులు లేక.. వానకాలం పంటలు కూడా నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ఎండిపోయేవి. పెద్ద రైతులతోపాటు చిన్న, సన్నకారు రైతులు కూడా దిక్కుతోచని స్థితిలో ఉండేవారు. ఇక వ్యవసాయ కూలీల పరిస్థితి అయితే మరీ దయనీయం.
అందుకే అందరూ కలిసి వలస వెళ్లేవారు. అలాంటి పరిస్థితులున్న తిరుమలాయపాలెం మండలంలో తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఉద్యమనేత కేసీఆర్ పాలనలో సిరులు పండే పరిస్థితులు ఏర్పడ్డాయి. నాడు కూలి దొరికితే చాలు అనుకున్న ఇక్కడి రైతులు, కూలీలు.. నేడు అన్ని సౌకర్యాలూ కల్పించి ఇతర రాష్ర్టాల కూలీలను తీసుకొచ్చి కూలి పనులు కల్పిస్తున్నారు. నికరంగా పనులు దొరకడం, కూలి ధరలు కూడా మెరుగ్గానే ఉండడం వంటి కారణాలతో వలస కూలీలు కూడా ఉపాధి పొందుతున్నారు.
కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి వల్లనే మా ప్రాంతంలో కరువు కాటకాలు తొలగిపోయాయి. కరువు పీడిత మండలాన్ని కడుపునింపే ప్రాంతంగా తీర్చిదిద్దిన ఘనత ముమ్మాటికీ గత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది. గత కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమేగాక సాగునీటి వనరులు ఏర్పాటు చేసింది.
దీంతో బీళ్లన్నీ సెల ఏళ్లయ్యాయి. రెండు పంటలూ పుష్కలంగా పండుతున్నాయి. ఫలితంగా అన్నదాతలందరమూ ఆనందంగా ఉంటున్నాం. ఇతర రాష్ర్టాల కూలీలకు పనులు కల్పించామన్న సంతృప్తిని పొందుతున్నాము. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత, ఇక్కడి వలసలను ఆపిన ఘనత గత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది.
-చామకూరి కిరణ్, రైతు, పిండిప్రోలు, తిరుమలాయపాలెం మండలం