Mid day meal | ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 23 : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మెనూ మారింది. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహార పదార్థాలను అందిస్తుండడంతో మధ్యాహ్న విందు పసందైంది. రోజుకో వెరైటీతో కూడిన మెనూ సిద్ధం చేశారు. దీంతోపాటు వారంలో మూడ్రోజులు కోడిగుడ్లు.. మరో మూడ్రోజులు రాగిజావ మెనూతో విద్యార్థుల కడుపునిండా పౌష్టికాహారాన్ని అందిస్తూ ఇంటిని మరిపిస్తున్నారు. మధ్యాహ్న భోజనం అందించే వంట ఏజెన్సీలకు ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా పక్కా భవనాలను నిర్మించారు. మధ్యాహ్న భోజనం ప్రతి విద్యార్థికి అందేలా ప్రధానోపాధ్యాయులు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభ రోజు జూన్ 12వ తేదీ నుంచే కొత్త మెనూను అమలు చేస్తున్నారు. విద్యా దినోత్సవం సందర్భంగా రాగిజావ కార్యక్రమాన్ని సైతం ప్రారంభించారు.
విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా రాజీపడడం లేదు. గత ప్రభుత్వాల హయాంలో విద్యార్థులకు దొడ్డుబియ్యంతో మధ్యాహ్న భోజనం అందించేవారు. దీంతో ఆ భోజనం తినలేక చాలామంది విద్యార్థులు స్కూళ్లకు రాకపోవడంతో చదువు మధ్యలో ఆగిపోగా.. బాల కార్మికులుగా మిగిలిపోయేవారు. వీటన్నింటిని నిశితంగా పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులు భావిభారత పౌరులుగా ఎదగాలని, వారికి ఆకలికేకలు తెలియకూడదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో పాఠశాలల్లో హాజరుశాతం పెరిగి విద్యార్థులు క్రమం తప్పకుండా వస్తున్నారు. ఇప్పటికీ ఈ పథకం ద్వారా ఎందరో విద్యార్థులకి లబ్ధి చేకూరుతున్నది.
మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ఉదయం 10:30 గంటల సమయంలో హెచ్ఎం వద్ద నుంచి ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారనే సమాచారాన్ని తీసుకుంటారు. విద్యార్థుల హాజరు ఆధారంగా వంట చేసి భోజన సమయానికి అందించాల్సి ఉంటుంది. ఆ రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థుల సంఖ్య ఆధారంగా సరిపడా నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు ఈ విధానం చాలా బాగా ఉపయోగపడుతున్నది. విద్యార్థుల సంఖ్య తెలుసుకోకుండా వంటలు చేయడం ద్వారా భోజనాలు ఎక్కువ, తక్కువ కావడం జరిగేది. దీంతో వండిన పదార్థాలు పడేయాల్సిన పరిస్థితి. ఇలాంటి వాటిని సంస్కరిస్తూ సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో విద్యాశాఖ అధికారులతో పలుమార్లు చర్చించి మధ్యాహ్న భోజనంలో కీలకమార్పులు చేశారు. వీటిల్లో ప్రధానంగా విద్యార్థుల హాజరుతో వంట వండి వడ్డించడం అద్భుతంగా ఉంది. దీంతో పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి సంబంధించి అవసరమైన కిచెన్ షెడ్లు మంజూరు చేసింది. మన ఊరు- మన బడి/ మన బస్తీ పథకంలో అవసరమైన చోట వంట గదులు నిర్మించగా, మిగిలిన చోట్ల గతంలో వంట గదులు నిర్మించేందుకు ప్రతిపాదనలు తీసుకుని నిధులు విడుదలవ్వడం, కిచెన్ షెడ్లు పూర్తవ్వడం కూడా జరిగిపోయాయి. రూ.కోట్లతో నిర్మించిన కిచెన్ షెడ్లు ఉపయోగంలోకి వచ్చాయి. గతంలో ఎక్కడో వండి పాఠశాలకు తీసుకొచ్చే సరికి భోజనంలో వేడి తగ్గడం, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం పాఠశాలల్లో కిచెన్షెడ్లను నిర్మించడంతో విద్యార్థులు వేడి వేడి భోజనాన్ని ఆరగిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో సైతం కిచెన్ షెడ్లు నిర్మించారు. దీంతో వంట నిర్వాహకులకు సైతం శ్రమ తగ్గి ప్రశాంతంగా భోజనాలను సిద్ధం చేస్తున్నారు. కిచెన్షెడ్లతోపాటు డైనింగ్ హాల్స్ విద్యార్థులకు అందుబాటులోకి రావడంతో సంతోషంగా భోజనం చేస్తున్నారు.