‘పోషకాహార లోపంతో చిన్నారుల ఎదుగుదల ఆగిపోవద్దు.. తక్కువ బరువుతో అనారోగ్యం పాలవ్వొద్దు.. బాలింతలు, గర్భిణులు రక్తహీనతతో బాధపడకూడదు.. తల్లీపిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే మంచి సమాజం ఏర్పడుతుంది..’ ఈ ప్రాధాన్యాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ‘ఆరోగ్యలక్ష్మి’ పథకాన్ని అమలు చేస్తున్నది. గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నది.. పోషణ్ అభియాన్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నది.. లబ్ధిదారులకు అందే సేవలను వెనువెంటనే ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నది. దీంతో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ప్రభుత్వం తీసుకుంటున్న చొరవపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘అన్నం పరఃబ్రహ్మ స్వరూపం’ అన్నారు పెద్దలు. వారు నేర్పిన సంస్కారం ప్రకారం.. అదే అన్నం వడ్డించే వాళ్లనైనా, పండించే వాళ్లనైనా ‘అన్నదాతా.. సుఖీభవ..’ అంటూ దీవిస్తాం. వంద కాదు వేయి కాదు.. జిల్లాలో దాదాపుగా 38 వేల మందికి రోజూ మధ్యాహ్నం పోషకాలతో కూడిన భోజనాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్ కూడా ఇదే కోవలోకి వస్తారంటే అతిశయోక్తి కాదేమో. ఎంతో ముందుచూపుతో ఆయన అమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్మి పథకం నేడు యావత్ దేశానికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. ఈ పథకం కింద అంగన్వాడీ కేంద్రాల ద్వారా జిల్లాలోని 38 వేల మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనం రూపంలో పౌష్టికాహారం అందుతోంది.
తద్వారా పోషణ లోపాన్ని నివారించడంతోపాటు ఆరోగ్యకరమైన సమాజానికి అడుగులు పడుతున్నట్లవుతోంది. రోజూ క్రమం తప్పకుండా రుచికరమైన భోజనం, ఒక కోడి గుడ్డు, 200 గ్రాములు పాలు అందుతున్నాయి. ఐదేళ్లుగా అమలవుతున్న ఈ పథకం ద్వారా అంగన్వాడీలకు చిన్నారులు, గర్భిణులు, బాలింతల హాజరుశాతం పెరిగింది. ఆరోగ్యలక్ష్మి పథకం నిర్వహణ, కేంద్రాల బలోపేతం కోసం స్థానిక పెద్దలతో ప్రతి కేంద్రానికీ మానిటరింగ్ కమిటీ ఏర్పాటైంది. జిల్లా విభజన తరువాత ప్రస్తుతం ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, మధిర, సత్తుపల్లి, కల్లూరు, కామేపల్లి ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 1,840 కేంద్రాల ద్వారా చిన్నారులు, మహిళలకు సేవలందుతున్నాయి.
మహిళల్లో రక్తహీనత, చిన్నారుల్లో బరువు తక్కువ, పోషణ లోపం కలిగిన వారికి సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పోషణ్ అభియాన్ అనే ప్రత్యేక మిషన్ను ప్రారంభించాయి. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏడాదిన్నరగా ఈ మిషన్ అమలవుతోంది. అంగన్వాడీ టీచర్లు తమ గ్రామం పరిధిలోని ఇంటింటికీ వెళ్లి పోషణ లోపం, తక్కువ బరువు, రక్త హీనత వంటి సమస్యలున్న చిన్నారులు, గర్భిణులను గుర్తిస్తారు. వైద్య శాఖ అధికారులతో వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అదనపు పోషకాలను అందిస్తున్నారు.
ఈ మిషన్ పర్యవేక్షణకు ప్రత్యేక కో ఆర్డినేటర్లను నియమించారు. జిల్లా స్థాయిలో ఓ ప్రత్యేక అధికారితోపాటు మరో కో ఆర్డినేటర్ సేవలందిస్తున్నారు. ప్రాజెక్టు స్థాయిలో ఒక బ్లాక్ కో ఆర్డినేటర్, మరో అసిస్టెంట్ అధికారి పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న జిల్లా కోఆర్డినేటర్ ఆయా ప్రాజెక్టుల్లో పని చేసే బ్లాక్ కో ఆర్డినేటర్కు, సీడీపీవోలకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన కో ఆర్డినేటర్లు ప్రాజెక్టు స్థాయిలో, సెక్టార్లో పనిచేస్తున్న పర్యవేక్షకులు, టీచర్లకు అవగాహన కల్పిస్తున్నారు.
ఉమ్మడి పాలనలో ఇందిరమ్మ అమృతహస్తం పథకం కింద ఏజెన్సీలోని ప్రాజెక్టుల్లో మాత్రమే మధ్యాహ్న భోజనం అమలయ్యేది. తెలంగాణ ఆవిర్భవించాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. మైదాన ప్రాంతాలకూ దీన్ని విస్తరించింది. ఖమ్మం జిల్లాలోని 1,840 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 17,188 మంది గర్భిణులు, బాలింతలకు, 21,561 మంది చిన్నారులకు పోషక పదార్థాలతో కూడిన ప్రత్యేక మెనూను అందిస్తోంది. పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అంగన్వాడీ కేంద్రం పరిధిలోని ప్రభుత్వ టీచర్, సర్పంచ్/ వార్డు కౌన్సిలర్, ఆవాస ప్రాంత పెద్దలు, పిల్లల తల్లిదండ్రులతో కూడిన కమిటీని నియమించింది. చిన్నారులకు నాణ్యమైన విద్యతోపాటు పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తుండడంతో అంగన్వాడీలకు హాజరయ్యే లబ్ధిదారులకు ఏటికేడు పెరుగుతూనే ఉంది.
ఆరోగ్యలక్ష్మి పథకం అమలుకు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇటీవల ఆన్లైన్ విధానం కూడా అమల్లోకి వచ్చింది. నిత్యం కేంద్రాల్లో భోజనం చేసే వారికి సంఖ్య, లబ్ధిదారుల పూర్తి వివరాల వంటివన్నీ ఆన్లైన్పో పొందుపరుస్తున్నాం. క్షేత్రస్థాయిలో ప్రత్యేక మనిటరింగ్ కమిటీలు పర్యవేక్షిస్తున్నాయి. మధ్యాహ్న భోజనం అమల్లోకి వచ్చిన తరువాత కేంద్రాలకు వచ్చే లబ్ధిదారుల సంఖ్య పెరిగింది.
-సీహెచ్ సంధ్యారాణి, జిల్లా సంక్షేమ అధికారి, ఖమ్మం