ఖమ్మం, జనవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం మెడికల్ కళాశాలకు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు నూతన కలెక్టరేట్ వద్ద జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.. తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెం గ్రామ సమీపాన అధునాతన సమీకృత కలెక్టరేట్ నిర్మాణం జరిగింది. ఈ నేపథ్యంలో పాత కలెక్టరేట్, జడ్పీ, ఆర్అండ్బీ కార్యాలయాలకు చెందిన భవనాలన్నీ సమీకృత కలెక్టరేట్లోకి వెళ్లనున్నాయి. ఆయా భవనాలను మెడికల్ కళాశాల, బోధనా తరగతులకు కేటాయించేందుకు తెలంగాణ సర్కారు అంగీకారం తెలిపింది.
ఇప్పటికే రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు పరిశీలించి వెళ్లారు. అదేవిధంగా నర్సింగ్ కళాశాల నిర్మాణానికి సైతం నిధులు మంజూరవడం, ఖమ్మం రూరల్ మండలం పరిధిలో స్థల సేకరణ జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఖమ్మానికి తలమానికంగా నిలువబోతున్న మెడికల్ కళాశాలకు నేడు కేరళ సీఎం పినరాయి విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్యాదవ్ వంటి ప్రముఖుల సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు లాంఛనంగా శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారు.