‘ఐటీ హబ్.. లకారం ట్యాంక్బండ్.. నూతన కలెక్టరేట్.. సకల సౌకర్యాలతో ఆర్టీసీ బస్టాండ్.. అబ్బురపరుస్తున్న ప్రధాన రహదారులు.. ఆహ్లాదాన్ని పంచుతున్న పార్కులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ‘స్తంభాద్రి’ నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు.. ఖమ్మం సిగలో మరో కలికితురాయి చేరింది. జిల్లా కేంద్రంలోని సర్కార్ దవాఖానకు అనుసంధానంగా మెడికల్ కళాశాల ఏర్పాటైంది. ఇప్పటికే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియమితులయ్యారు. వచ్చే నెల నుంచే వంద మంది విద్యార్థులతో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభంకానున్నాయి. సదరు ఏర్పాట్లపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
– ఖమ్మం, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం (నమస్తే తెలంగాణ ప్రతినిధి), జూలై 8: ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్కార్ దవాఖానకు అనుసంధానంగా మెడికల్ కళాశాల సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. ఇప్పటికే పాత కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోదాము, పౌర సరఫరాల శాఖ, గిరిజన అభివృద్ధి శాఖలకు చెందిన భవనాల్లో అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులు, తరగతి గదులు, పాత ఆర్అండ్బీ శాఖ భవనంలో బాలికలు, వైద్యారోగ్యశాఖకు చెందిన పాత భవనంలో బాలురకు హాస్టల్స్ సిద్ధమయ్యాయి. మెడికల్ కళాశాలలో వసతుల కల్పనతోపాటు నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.166 కోట్లు మంజూరు చేసింది. వీటిలో ఇప్పటికే పాత భవనాల ఆధునీకరణకు రూ.9.6 కోట్లు ఖర్చయ్యాయి. మిగతా నిధులను వైద్యారోగ్యశాఖ అధికారులు నర్సింగ్ కళాశాలతోపాటు అన్ని విభాగాలకు చెందిన పరికరాలు, ఫర్నీచర్ కొనుగోలుకు వెచ్చించనున్నారు. వైద్య విద్యార్థులు దవాఖానకు చేరుకోవాలంటే వైరా ప్రధాన రహదారి ఉంటుంది కాబట్టి ప్రమాదాల నివారణ దృష్ట్యా అధికారులు ఆసుపత్రి, పాత కలెక్టరేట్కి మధ్య రూ.3.25 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నారు.
అడ్మిషన్లపై విద్యార్థుల ఆరా..
మెడికల్ కళాశాల ఏర్పాటుకు ఇక్కడ ఉన్న వసతులను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) బృందం పరిశీలించింది. అనంతరం కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది వంద మంది విద్యార్థులకు అడ్మిషన్లు తీసుకోనున్నారు. వీరిలో 85 మంది తెలంగాణ విద్యార్థులు కాగా మిగతా విద్యార్థులు 15 ఇతర రాష్ర్టాలకు చెందిన వారు. నీట్ ర్యాంకుల ఆధారంగా ఇప్పటికే విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్నారు. ఖమ్మం మెడికల్ కళాశాలకు ప్రత్యేక వెబ్సైట్ ఉండడంతో విద్యార్థులు ఆన్లైన్లోనే కోర్సుల వివరాలు తెలుసుకుంటున్నారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు లు, తరగతి గదులు, వైద్య విద్యకు అవసరమైన వసతులు, హాస్టల్స్కు సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నారు. కొందరు స్వయంగా నగరానికి వచ్చి వసతులు చూసుకుంటున్నారు.
మెడికల్ కళాశాలలో కోర్సులు ఇవే..
ఆగస్టు లేదా సెప్టెంబర్ నెల నుంచి మెడికల్ తరగతులు ప్రారంభం కానున్నాయి. నాలుగు సంవత్సరాల కోర్సులో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మసీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ప్రివెంటివ్ మెడిసిన్, ఈఎన్టీ, ఆప్తమాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్తోపాటు ఇతర సబ్జెక్ట్లు ఉంటాయి. ఆయా సబ్జెక్ట్ల బోధనకు ఇప్పటికే ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావుతో కలిపి ఆరుగురు ప్రొఫెసర్స్, 25 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్(అసిస్టెంట్ ప్రొఫెసర్స్) నియమితులయ్యారు. తరగతులు ప్రారంభమైన తర్వాత వంద మంది విద్యార్థులు ఆసుపత్రి పరిధిలో ఉండి ప్రజలకు వైద్యసేవలు అందించనున్నారు. ఆసుపత్రిలో ఐసీయూ బెడ్ల సంఖ్య పెరుగుతుంది. బయాప్సీ, లాప్రోస్కోపిక్, సీటీ స్కాన్ పరీక్షలు సైతం ప్రజలు ఆసుపత్రి పరిధిలోనే చేయించుకునే అవకాశం ఉంటుంది. మున్ముందు ఎంబీబీఎస్ పీజీ కోర్సునూ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
మంత్రి పువ్వాడ అజయ్ చొరవతోనే..
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పట్టుబట్టి ఖమ్మానికి ప్రభుత్వ మెడికల్ కళాశాలను సాధించారు. చొరవ తీసుకుని సీఎం కేసీఆర్తో మాట్లాడి నిధులు రాబట్టారు. పెద్దాసుపత్రికి అందుబాటులో ఉన్న పాత కలెక్టరేట్ సముదాయం, ఆర్అండ్బీ భవనం, వైద్యారోగ్యశాఖ భవనాలను మెడికల్ కాలేజీకి వినియోగించుకునేలా అనుమతులు తీసుకొచ్చారు. కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి ఎప్పటికప్పుడు కాలేజీ పనులను పర్యవేక్షించారు. ఇటీవల కళాశాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పరిశీలించి అబ్బురపడ్డారు. అతి తక్కువకాలంలో కళాశాలను తరగతులకు సిద్ధం చేసిన తీరును ప్రత్యేకంగా అభినందించారు.
త్వరలో మెడికల్ తరగతులు..
అసెంబ్లీ సమావేశాల్లో నేను అడిగిందే తడవుగా సీఎం కేసీఆర్ ఖమ్మానికి ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. ఇది ఖమ్మం జిల్లా ప్రజలపై ఆయనకున్న మమకారానికి నిదర్శనం. కాలేజీ కోసం సీఎం కేసీఆర్ రూ.166 కోట్లు నిధులు కేటాయించారు. ఆ నిధుల్లో భవనాల ఆధునీకరణకు రూ.9.6 కోట్లు ఖర్చుచేస్తున్నాం. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సైతం రూ.3.25 కోట్లు వెచ్చిస్తున్నాం. త్వరలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సర విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. మెడికల్ కళాశాల ప్రారంభమైతే ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందుతాయి. ఇంత గొప్ప వరాన్ని ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు.
– రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్