ఖమ్మం, ఏప్రిల్ 30: శ్రామికుల పండుగ అయిన ప్రపంచ కార్మిక దినోత్సవ (మే డే) వేడుకలను జరుపుకునేందుకు ఉమ్మడి జిల్లాలోని కార్మిక లోకం సన్నద్ధమైంది. సోమవారం జరిగే 138వ మేడేకు కార్మిక సంఘాల నేతలు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ‘నేడే మేడేనోయ్.. ఈనాడే మేడేనోయ్..’ అంటూ కార్మిక శక్తిని తెలియజేసే గీతాలు వాడవాడలా వినిపించనున్నాయి. ‘బడిలో.. గుడిలో.. సాగు భూమిలో.. కొండలు పిండిచేసే క్వారీల్లో.. ఇటుకబట్ట్టీల్లో.. మైనింగ్ క్వారీల్లో.. నిప్పుల కొలిమిలో.. కరకు కార్ఖానాల్లో అంతటా నువ్వే.. అన్నింటా నువ్వే.. వెలకట్టలేని త్యాగానికి అర్థం నీవు.. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీక నీవు.. శ్వేదం విలువకు నిలువెత్తు నిదర్శనం నీవు.. శ్రమశక్తిని చాటిచెప్పే కార్మికుడా జోహార్..’ అంటూ కార్మికుల శ్రమ విలువను తెలియజెప్పే గీతాలు శామికవర్గానికి చైతన్యం కలిగించనున్నాయి.
కార్మిక దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించేందుకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్, భవన నిర్మాణం, సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఉన్న కార్మికులు మేడేను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మేడే రోజున ఉదయాన్నే కార్మిక జెండాలను ఆవిష్కరించి పండుగ వాతావరణంలో వేడుకలను నిర్వహిస్తారు.
నాడు చికాగోలో ఎగిరిన పోరు జెండా..
‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి.. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప.’ అని మార్క్సిస్టు నేత కార్ల్మార్క్స్ ఇచ్చిన నినాదం ప్రపంచ కార్మికులను ఉత్తేజపరిచి పోరాటంలోకి మరింత ముందుకు నడిపించింది. 1886కు ముందు ప్రపంచ వ్యాప్తంగా 18 గంటలు, 16 గంటల ప ని విధానాలు అమల్లో ఉండేవి. యజమానులు కార్మికుల శ్రమను దోచుకునేవారు. ఈ దోపిడీ విధానం పోవాలంటూ ప్రపంచ కార్మికులు అన్ని దేశాల్లో పోరాటాలు మొదలుపెట్టారు. అమెరికా దేశంలో చికాగో నగరంలోని గడీలలో, కార్ఖానాల్లో పనిచేసే కార్మికులు తమకు పనికి తగ్గ వేతనం కావాలంటూ ధర్నా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అక్కడి యాజమానులు, భూస్వాములు కలిసి కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వకుండా వారిని పొట్టున పెట్టుకున్నారు. వందలాది మంది కార్మికులను అక్కడి భూస్వాములు చంపివేశారు. ఆ రక్తపు మడుగులోంచి కార్మికుల్లో ఒకరు రక్తంతో తడిసిన తన చేతి రుమాలును తీసి కార్మిక జెండాగా పైకి ఎగురవేశారు. ఆనాటి నుంచి మే 1ని ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అనేకమంది తమ ప్రాణాలను తృణపాయంగా అర్పించి శ్రమదోపిడీపై విజయం సాధించారు. 1886 మే 1 నుంచి 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చింది.
సంఘాల ఆధ్వర్యంలో సన్నాహాలు..
మేడే రోజంటేనే కార్మికుల పండుగ. అన్ని వర్గాల కార్మికులు ఎంతో ఆనందంగా, సంతోషంగా మేడే ఉత్సవాలను జరుపుకుంటారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని అనేక రాజకీయ పార్టీల అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయా నిర్వహణ కమిటీలు ఆయా పనుల్లో నిమగ్నమయ్యాయి. బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున మేడే వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా అడ్డాల వద్ద జెండాలను ఎగురవేసేందుకు కార్మిక సంఘాల దిమ్మెలకు రంగులు వేస్తున్నారు. తోరణాలు కట్టి జెండాలను ఎగురవేస్తారు. కార్మిక ఉద్యమంలో కార్మికుల హక్కులను నెరవేర్చే క్రమంలో ప్రాణాలను కోల్పోయిన వీరులను తలుచుకొని వారి జ్ఞాపకాలను పంచుకుంటారు.