కొత్తగూడెం క్రైం/చర్ల, జనవరి 17: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు ప్రతీకారేచ్చతో భద్రతా దళాలలపై రాకెట్ లాంచర్లను ప్రయోగించారు. అప్రమత్తంగా ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది మావోయిస్టుల చర్యలను తిప్పకొట్టారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలిసిన వివరాల ప్రకారం.. తెలంగాణ సరిహద్దును ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పామేడ్ పోలీస్స్టేషన్ పరిధిలో కొన్నేళ్ల నుంచి మూడు సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్లు నడుస్తున్నాయి. వాటిని టార్గెట్ చేస్తూ మావోయిస్టులు మంగళవారం రాత్రి క్యాంపులకు వెళ్లే రహదారులపై వృక్షాలు నరికి అడ్డుగా వేశారు. అనంతరం వాటిని దహనం చేస్తూ మంటలు ఎగసేలా చేశారు. అనంతరం ఏకకాలంలో మూడు బేస్క్యాంప్లపై బ్యారల్ గ్రానేడ్ లాంచర్ల (బీజీఎల్స్)ను ప్రయోగించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో మంటలు ఉవ్వెత్తున ఎగిశాయి.
అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ భద్రతా దళాలు అప్రమత్తమై మావోయిస్టుల విధ్వంసక చర్యలను తిప్పికొట్టాయి. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా జవాన్లు బయటపడ్డారు. మావోయిస్టుల ఉనికిని నిర్మూలించేందుకు ‘ఆపరేషన్ ప్రహార్’లో భాగంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కొద్దిరోజుల నుంచి పారా మిలిటరీ బలగాలతో దండకారణ్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్నది. మరోవైపు భద్రతా దళాల కట్టడితో మావోయిస్టు పార్టీ అట్టుడికిపోతున్నది. ఈ నేపథ్యంలో తన ఉనికిని చాటుకునేందుకు పామేడ్ పోలీస్స్టేషన్ పరిధిలోని మూడు బేస్క్యాంప్లపై రాకెట్ లాంచర్లను ప్రయోగించినట్లు అక్కడి పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దండకారణ్యంలో యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఆయా ప్రాంతాలను ప్రత్యేక భద్రతా బలగాలు మోహరించి మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. దాడిని ఎదుర్కొన్న మూడు బేస్ క్యాంపుల్లో చింతవాగు వాగు- ధర్మారం సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ తెలంగాణ పరిధిలోని భద్రాద్రి జిల్లా చర్ల మండలానికి అత్యంత చేరువలో ఉంటుంది.