భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో మార్చి 3న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. సోమవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య శాఖ, వివిధ శాఖల జిల్లా అధికారులతో పల్స్ పోలియోపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 3న నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా మూడు రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా 97,522 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు వంద శాతం పోలియో చుక్కలు వేయాలన్నారు. పలు కారణాలతో మిగిలిపోయిన చిన్నారులకు 4, 5 తేదీల్లో ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 925 పోలియో కేంద్రాలు, 38 సంచార పోలియో టీములు, 33 ట్రాన్సిట్ టీంలను ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్వో శిరీష కలెక్టర్కు వివరించారు. పల్స్ పోలియో కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, వలంటీర్లు పాల్గొనాలని ఆదేశించారు. పల్స్ పోలియోపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో రవీంద్రనాథ్, డీఆర్డీవో విద్యాచందన, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
కొత్తగూడెం టౌన్, ఫిబ్రవరి 26 : ప్రజావాణిలో బాధితుల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. పాల్వంచ మండలం జగ్గుతండాకు చెందిన బాధితులు, ఇల్లెందు మండలం సుదిమళ్లకు చెందిన ఉపేందర్రావు, బండారి శ్రీనివాసరావు, మణుగూరుకు చెందిన కాంట్రాక్టర్ వేముల లక్ష్మయ్య తదితరులు తమ దరఖాస్తులను కలెక్టర్కు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో రవీంద్రనాథ్, డీఆర్డీవో విద్యాచందన పాల్గొన్నారు.