– డీవైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి బొడ్డు మధు
ఖమ్మం రూరల్, జూలై 13 : ఈ నెల 15న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే నిరుద్యోగ మహాధర్నాను జయప్రదం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డీవైఎఫ్ఐ) ఖమ్మం జిల్లా కార్యదర్శి బొడ్డు మధు అన్నారు. ఖమ్మం మండలంలోని పొన్నెకల్ గ్రామంలో సోమవారం డీవైఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్డు మధు మాట్లాడుతూ… ఎన్నికల సందర్భంగా అధికారంలోకొస్తే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటి వరకు కనీసం 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయలేదని విమర్శించారు. నిరుద్యోగ సమస్యతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే మూసీ నది ప్రక్షాళన, హైడ్రా, ఫుట్ బాల్ అంటూ ముఖ్యమంత్రి కాలయాపన చేస్తున్నాడని విమర్శించారు.
నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని కోరుతూ సీపీఎం, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 15న ఇందిరా పార్కు వద్ద నిర్వహించే నిరుద్యోగ మహాధర్నాను జయప్రదం చేయాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. ఈ మహా ధర్నాకు జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత, నిరుద్యోగులు పార్టీలకు, సంఘాలకు పార్టీలకు భారీ సంఖ్యలో హాజరై ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు వేల్పుల ప్రవీణ్, సీనియర్ నాయకులు కత్రం ఉపేందర్, డీవైఎఫ్ఐ నాయకులు పాషా, సాగర్, నరేష్, కిరణ్, రాము, శ్రీను, వెంకట్, కిషోర్, రాజేష్ పాల్గొన్నారు.