భద్రాచలం, ఫిబ్రవరి 24: గిరిజన విద్యార్థులకు చక్కటి బోధనతోపాటు, వారు వందశాతం పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు అన్నారు. గురువారం స్థానిక సమ్మక్క-సారక్క ఫంక్షన్హాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏటీడీవోలు, ఎస్సీఆర్పీలు, ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలు, హాస్టల్ వార్డెన్లతో పాఠశాలల పనితీరుపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా విద్యార్థులు చదువును కోల్పోయారని, హెచ్ఎంలు బాధ్య త వహించి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు తరగతులకు హాజరు కాకపోతే వారి తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాలలకు వచ్చే విధంగా చర్య లు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీడీ ట్రైబల్ వెల్ఫేర్ రమాదేవి, ఖమ్మం డీటీడీఓ కృష్ణా నాయక్, భద్రాచలం, వైరా, ఇల్లెందు, దమ్మపేట, ఏటీడీవోలు నర్సింహారావు, తిరుమలరావు, కౌసల్య, పవన్కుమార్, ఏసీఎంవోలు రమణయ్య, రాములు, జీసీడీఓ అలివేలు మంగతాయారు, పీడీ వీరు నాయక్, హెచ్ఎంలు, వార్డెన్లు పాల్గొన్నారు.
కిన్నెరసాని క్రీడా పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అంతర్జాతీయ స్థాయిలో ప్రో వాలీబాల్ ఆడడం గర్వించదగ్గ విషయమని ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు తెలిపారు. గురువారం తన చాంబర్లో విద్యార్థి టీ నవీన్, కోచ్ను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన నవీన్ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రో వాలీబాల్ టోర్నమెంట్లో చైన్ బ్లిడ్జ్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడన్నారు. నవీన్ను ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థులు తమ అభిరుచిని బట్టి సంబంధిత పీడీల సహకారంతో ఆటలు ఆడి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీడీ రమాదేవి, క్రీడా అధికారి వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు.