‘సాపాటు ఎటూ లేదు.. పాటైనా పాడు బ్రదర్.. రాజధాని నగరంలో వీధీ వీధీ నీదీ నాదే బ్రదరూ..’ అన్నారు 1980లో వచ్చిన ‘ఆకలి రాజ్యం’ సినిమాలో ఆచార్య ఆత్రేయ. ఆనాడు ఆయన రాసిన ఈ గీతం 2024లో ఆటోవాలాల బతుకుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన సంక్షోభానికి సరిగ్గా సరిపోతుందని బహుశా ఆయన ఊహించి కూడా ఉండరు. అయినా ఆయన చెప్పిన మాటలు ఆనాడు నిరుద్యోగుల జీవితాలకు, ఈనాడు ఆటో కార్మికుల జీవనగాథకు అద్దం పడుతున్నాయి.
సరిగ్గా ఆరు నెలలకు ముందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో మహిళలు, విద్యార్థినులు, ఉద్యోగినులతో కిటకిటలాడిన ఆటోలు.. నేడు అవే వేళలో ఎవరూ ఎక్కక వెలవెలబోతున్నాయి. ఫలితంగా ఆటో కార్మికుల బతుకులు కటకటలాడుతున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఏకైక దుర్బుద్ధితో ఎడాపెడా ఇచ్చిన హామీల్లో భాగంగా ముందూవెనుకా చేయని ఆలోచన ఫలితంగా తెచ్చిన ‘మహాలక్ష్మి’ పథకం మహిళలను సంతృప్తి పరిచిందోలేదోగానీ ఆటోరిక్షా తోలకాన్నే వృత్తిగా ఎంచుకొని కుటుంబాలను పోషించుకుంటున్న వేలాది ఆటో కార్మికుల జీవితాలను ఒక్కదెబ్బకే ఛిద్రం చేసింది. ఫలితంగా వారి జీవితం.. సగటు రైతు కూలీకంటే దయనీయమైంది. ‘పిలిస్తే పలికే నేస్తాన్ని.. మీ చెంతనే ఉండే ఆటో డ్రైవర్ని’ గర్వంగా చెప్పుకునే ఆటోవాలాల గౌరవం గంగపాలైంది.
ఆటో తోలకాన్నే వృత్తిగా ఎంచుకున్న కొందరు.. దానిని అంతే గౌరవంగా భావించారు. ఎంతోమంది ఆటో కార్మికులు కేవలం తాము ఆటో తోలగా వచ్చిన ఆదాయంతోనే ఏ లోటూ లేకుండా కుటుంబాన్ని పోషించునేవారు. మరెంతోమంది ఆటోవాలాలు పైసాపైసా కూడబెట్టి పిల్లలను ఉన్నత చదువులు చదివించేవారు. అవసరమైతే పస్తులుండి మరీ పిల్లలకు ఘనంగా వివాహాలు జరిపించేవారు. ఇలాంటి దృశ్యాలు మన ఇరుగుపొరుగున కూడా ఎన్నో సాక్షాత్కరించేవి. వారంతా ఉన్న నగదంతా వెచ్చించి ఆటోను కొనుగోలు చేసిన వాళ్లేం కాదు. చేతిలో చల్లిగవ్వ లేకున్నా ఫైనాన్స్లో ఆటో తెచ్చుకొని మరీ తోలుకునేవారు. ఇటు కిస్తీలు కడుతూనే.. అటు ఏ లోటూ రాకుండా కుటుంబాన్ని పోషించుకునే వారు. కానీ ‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం’ అంటూ కాంగ్రెస్ తెచ్చిన పథకంతో కనీసం కిస్తీలు కట్టుకునేంత ఆదాయం కూడా నేడు ఆటోవాలాలకు రావడం లేదంటే అతిశయోక్తి కాదు. చివరికి కిస్తీ కట్టకపోతే తన ఆటోను ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్తారేమోనని, అదే జరిగితే ఇప్పటికే రోడ్డున పడిన తన కుటుంబం ఇకపై అగాధంలోకి వెళ్తుందని ఆటోవాలాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆటోను కాపాడుకునేందుకు, ఎలాగైనా కుటుంబాన్ని పోషించుకునేందుకు చివరికి గిరిగిరి అప్పులు చేసి మరీ కిస్తీలు చెల్లిస్తున్నారు. ఆటోవాలాలకు నెలకు రూ.15 వేల భృతి ఇస్తామంటూ ఎన్నికలప్పుడు బాకాలూదిన కాంగ్రెస్ పాలకులు.. తీరా గెలిచాక ఆ ఊసే మరిచారు. ఆటోవాలాలకు మరణశాసనాన్ని మిగిల్చారు. ఆటోవాలాల ఆత్మహత్యలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.
ఖమ్మం జిల్లాలో సుమారు 30 వేలకు పైగా ఆటోలున్నాయి. వాటిపై దాదాపు 40 వేలకు పైగా కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఈ ఆటో కార్మికులందరూ ఆరు నెలల క్రితం వరకూ ఆటో తోలుకొని రోజుకు రూ.1000 వరకూ ఆదాయాన్ని సమకూర్చుకునే వారు. కానీ ‘మహాలక్ష్మి’ పుణ్యమా అని నేడు రోజంతా ఎదురుచూసి తోలినా రూ.200 దాటితే గగనం. ఈ మొత్తంతో కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్య ఆరోగ్య ఖర్చులు సహా ఇత్యాది అవసరాలు వెళ్లదీయడం వారి కష్టానికి మించిన భారం. మరి ఈ నేరం.. కాంగ్రెస్ పాలకులది కాదంటే పాపం.
ఎన్నో ఏళ్లుగా ఆటో తోలుకుంటూ కుటుంబాన్ని బతికించుకుంటున్నా. ఆకలిదప్పులు లేకుండా ఇన్నాళ్లూ ఎంతో గౌరవంగా బతికా. కానీ.. ఇప్పుడు ‘ఫ్రీ బస్’ వచ్చాక ఆటో ఎక్కేవాళ్లు తక్కువయ్యారు. ఉదయమే బండి తీసి అడ్డాలో పెట్టినా ఎక్కే వాళ్లే రావట్లేదు. మహిళలందరూ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లు ఎక్కి వెళ్తున్నారు. మధ్యాహ్నమైనా పట్టుమని పదిమంది కూడా ఎక్కే పరిస్థితి లేదు. చివరికి ఆకలేస్తే ఇంటికెళ్లాల్సిన పరిస్థితి. మా బతుకులు మరింత దారుణమయ్యాయి. కూలికి వెళ్లేవాళ్లకైనా సాయంత్రానికి కూలి డబ్బులు చేతికి వస్తాయి. కానీ.. ఇప్పుడు మా దుస్థితి అంతకంటే దయనీయమైంది. అప్పు చేసి మరీ కొనుక్కున్న ఆటోను ఎప్పుడు ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్తారోనన్న భయం వెంటాడుతోంది. ‘ఫ్రీ బస్’ తెచ్చిన ఈ ప్రభుత్వం మా బతుకులపైనే దెబ్బకొట్టింది.
అతడు ఒక వేద ముస్లిం. పేరు సయ్యద్ ముజీద్. కొత్తగూడెం హనుమాన్ బస్తీ. బతుకుభారాన్ని మోసేందుకు, కుటుంబాన్ని పోషించుకునేందుకు రెండేళ్ల క్రితం రూ.2,40,000 ఫైనాన్స్తో ఆటో కొనుగోలు చేశాడు. ముందుగా తన వాటాగా రూ.40 వేలు చెల్లించినప్పటికీ అసలూ, వడ్డీ కలిపి అప్పు తీరే నాటికి మరో రూ.లక్ష అదనమయ్యేది. రోజంతా కష్టపడి ఆటో తోలుతానని, కిస్తీలు పోగా కుటుంబ పోషణ కోసం సాయంత్రానికి చేతినిండా ఆదాయం తీసుకెళ్తానని బలంగా నమ్మాడు. ఏడాదిన్నరగా అంతే నమ్మకంతో పనిచేస్తున్నాడు. జీవితం అతడు బలంగా నమ్మినట్లుగానే సాగింది. కానీ.. సరిగ్గా ఆరు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని తెచ్చింది. ముజీద్ బలమైన నమ్మకాన్ని బలహీనం చేసింది. ఇప్పుడతను నెలకు రూ.8,350 కిస్తీ కట్టాలి. డీజిల్ ఖర్చుపోగా సాయంత్రానికి ఇంట్లోకి సరుకులు తీసుకెళ్లాలి. పిల్లల ఫీజులు, ఆరోగ్య ఖర్చులు ఇతరత్రాలు కట్టాలి. కానీ.. రోజుకు రూ.200 కూడా దాటని నేటి ఆదాయానికి ఇవన్నీ అసాధ్యమయ్యాయి. కానీ వృత్తిని వదులుకోలేక, అవయవం లాంటి ఆటోను వదులుకోలేక సతమతమయ్యాడు. ఎలాగైనా ఆటోను కాపాడుకోవాలన్న సంకల్పంతో చివరికి ఒక గిరిగిరి వ్యాపారి వద్ద మరో అప్పు తీసుకున్నాడు. తోలినా తోలకున్నా రోజూ సాయంత్రానికి అతడికి అప్పు చెల్లిస్తున్నాడు. ‘ఇక ఫీజులు నేను కట్టలేను తల్లీ..’ అంటూ నచ్చజెప్పుకొని తన కుమార్తెను ప్రభుత్వ కాలేజీలో చేర్పించాడు.
ఏళ్లుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నా. ఫ్రీ బస్సులు పెట్టక ముందు మా ఆడ్డా ఆటోలకు కిరాయిలు మస్తుగ ఉండేవి. మహిళలు ఎక్కువగా ఆటోలనే ఎక్కడంతో గిరాకీ బాగుండేది. ప్రభుత్వం ఉచిత బస్సు అన్నప్పటి నుంచి ఆటోల్లో ఎక్కేవాళ్లు లేక అడ్డాల్లోనే ఖాళీగా కూర్చుంటున్నం. ప్రయాణికుల కోసం గంటలకొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో రోజుకు రూ.వెయ్యి కిరాయి తోలేవాణ్ణి. ఇప్పుడు రూ.వందలు కూడా సరిగ్గా రావట్లేదు.
మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణం చేస్తుండడంతో ఆటో ఎక్కేవారు కరువయ్యారు. గతంలో రోజుకు కనీసం రూ.వెయ్యి సంపాదించడంతో కుటుంబ పోషణతోపాటు వచ్చిన దాంట్లో పిల్లలను చదివించుకునేవాళ్లం. ఇప్పుడు ఆటో ఎక్కేవారు లేకపోవడంతో ఫైనాన్స్లు కట్టలేక ఆటోలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు సౌకర్యంతో మా బతుకులు ఆగమవుతున్నాయి. ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటోవాలాల బతుకు ఆగమైంది. బస్సుల్లో ఎప్పుడూ లేనంతగా మహిళలు ప్రయాణం చేస్తుండడంతో అత్యవసరంగా వేరే ప్రాంతాలకు వెళ్లే సమయంలో ప్రయాణించేందుకు చోటు లేకపోవడంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఆటోల్లో ఎవరూ ప్రయాణించకపోవడంతో రోజుకు మూడు ట్రిప్పులు వేసే వాళ్లం.. ఇప్పుడు ఒక టిప్పు నడపడమే కష్టంగా మారింది. మా బతుకులను బాగు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – బాజీ, వీఎం బంజర, పెనుబల్లి మండలం ఇరవై రోజులు ఖాళీ జేబులే ఉదయం 6 నుంచి రాత్రి వరకు మూడు షిప్టులు ఆటో నడుపుకుంటున్నా. ఇంత కష్టపడ్డా నెలలో 20 రోజులు మాత్రం జేబులు ఖాళీనే. ఇంటికి ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలో అర్థం కావడం లేదు. ద్విచక్ర వాహనాలు కూడా ఎక్కువ కావడంతో వచ్చే పదో పరకో కూడా చేయి దాటిపోతోంది. ఇద్దరు పిల్లలతోపాటు వృద్ధ తల్లిదండ్రులను పోషించుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీంతో ఆటో ఎక్కేవారు లేకపోవడంతో మా బతుకులు ఆగమైనయ్. రోజూ ఆటో నడిపితే రూ.వెయ్యి, రూ.1,200 వరకు సంపాదించే వాళ్లం. కుటుంబ పోషణ కూడా ఇబ్బంది లేకుండా ఉండేది. ప్రభుత్వం మాకు సాయం చేస్తామని చెప్పి ఇచ్చిన మాట తప్పింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆత్మహత్యలే శరణ్యమయ్యే పరిస్థితి ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు పెట్టడంతో ఆటో కార్మికుల కుటుంబాలను వీధిన పడేసినైట్లెంది. రోజూ గిరాకీ లేక ఇల్లు గడవడమే కష్టంగా మారింది. ఈ ఏడాది పాఠశాలల్లో పిల్లల ఫీజులెట్ల కట్టాల్నో తోచడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం దయతలిచి ఆటో డ్రైవర్లకు జీవన భృతి కల్పించాలి. నెలకు రూ.12 వేలు ఆర్థిక సాయం చేయాలి. లేదంటే మాకు ఆత్మహత్యే శరణ్యం అవుతుంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. దీనివల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది. ఆటో నడిపితే రోజుకు రూ.600 నుంచి రూ.700 వరకు ఆదాయం వచ్చేది. ఇప్పుడు డీజిల్ ఖర్చులు కూడా రావట్లేదు. ఇంకొన్ని రోజులైతే ఆటోలు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఆటో డ్రైవర్ల జీవనోపాధి కోసం ఒక పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.
ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒకరు డిగ్రీ, మరొకరు బీ ఫార్మసీ. వీరికి ఫీజులతోపాటు అనేక రకాల పుస్తకాలు కొనుగోలు చేస్తున్నా. దీంతోపాటు కుటుంబ పోషణ కూడా చేసుకోవాలి. వృద్ధులైన తల్లిదండ్రుల దవాఖాన ఖర్చులతోపాటు వారి ఆరోగ్యపరంగా కావాల్సిన ఆహార పోషక పదార్థాలను నేనే కొనాలి. అందరి బాధ్యత నా పైనే ఉంది. ఆటో గిరాకీ లేక ఇబ్బందిగా ఉంది. ఇక మున్ముందు అమ్మాయిల పెళ్లి చేయాలంటేనే దడ పుట్టిస్తోంది.