మధిర: గణేష్ మండపాల నిర్వహణ కమిటీలు తప్పనిసరిగా పోలీసుశాఖ అనుమతి తీసుకోవాలని మధిర సీఐ మురళి తెలిపారు. బుధవారం స్థానిక రిక్రియేషన్క్లబ్ కళ్యాణ మండపంలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా గణేష్ మండపాల ఏర్పాటుకు ఉత్సవ కమిటీ మండపాల అనుమతి కోసం అన్ని వివరాలతో పోలీసు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అనుమతి కోసం వైరా ఏసీపీ వద్దకు పంపడం జరుగుతుందని, సక్రమంగా లేని దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతందని పేర్కొన్నారు. గణేష్ మండపాల నిర్వహణ కమిటీదారులు విధిగా మండపాల వద్ద నిమ్మజనం అయ్యేంత వరకు అనుమతిపత్రాన్ని అతికించాలని సూచించారు.
గణేష్ మండపాల నిర్వహణకమిటీ దారులు ఆన్లైన్ దరఖాస్తు ఫారంతో పాటు, విద్యుత్శాఖ అనుమతి, హౌస్ఓనర్ అనుమతి తీసుకొని పత్రాన్ని, స్పీకర్స్ కోసం ప్రత్యేకంగా అనుమతి పత్రాన్ని జతచేయాలన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు భక్తులందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సైదులు, ఎంపీడీవో విజయభాస్కర్రెడ్డి, పట్టణ ఎస్సై సతీష్కుమార్, మధిర మున్సిపల్ కమీషనర్ అంబటి రమాదేవి, విద్యుత్శాఖ ఏఈ శరత్కుమార్, తదితరులు పాల్గొన్నారు.