ఖమ్మం జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఎక్కడి ధాన్యం అక్కడే కేంద్రాల్లో నిలిచిపోయింది. అన్నదాతలు రేయింబవళ్లు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. వాన పడితే తమ కష్టం నీళ్లపాలు అవుతుందని ఆవేదన చెందుతున్నారు. పదిరోజులుగా జిల్లాలో నిత్యం రైతులు రోడ్డెక్కి ధాన్యం కొనండి మహాప్రభో..! అం టూ మొరపెట్టుకుంటున్నారు. అయినా రైతుల గోడును పట్టించుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు లేకుండాపోయారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు అన్నదాతలకు కన్నీళ్లు మిగిలిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట మిల్లులకు చేరడం ప్రహసనంగా మారింది. ఖమ్మం జిల్లాలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరే అవకాశం ఉండగా.. ఇప్పటివరకు 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తూకం వేసినట్లు తెలిసింది.
అయితే ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా జరగడానికి ప్రధాన కారణం ట్రాన్స్పోర్ట్, హమాలీల కొరతగా భావిస్తున్నారు. అలాగే మిల్లులకు చేరిన ధాన్యం దిగుమతి చేయడానికి అత్యధిక సమయం పడుతోంది. దీంతో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు, లారీల యాజమాన్యాలు వాపోతున్నారు. అయితే గత మూడు రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ఎగుమతులు ఆగిపోయినట్లు సమాచారం. రవాణా శాఖ అధికారులు లారీలను మొక్కజొన్న కేంద్రాలకు తరలిస్తుండటంతో జిల్లాలో ధాన్యం కేంద్రాల్లో ఎక్కడి రాశులు అక్కడే మూలుగుతున్నాయి. కాంటాలు వేసి ధాన్యం తోలకాలు జరక్క కొన్ని కేంద్రాల్లో… అసలు కాంటాలు కాక మరికొన్ని కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. కొనుగోళ్లు పూర్తయిన ధాన్యం రైస్మిల్లులకు చేరే వరకు రైతులదే బాధ్యత అని అధికారులు చెబుతుండటంతో రైతులు అవస్థలు పడుతున్నారు.
– ఖమ్మం, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ధాన్యం ట్రాన్స్పోర్టు వ్యాపారం గుత్తేదార్లకు కాసులు కురిపిస్తుండటంతో పోటీపడి టెండర్లు కైవసం చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ధాన్యం రవాణా చేసేందుకు టెండర్లో పాల్గొనే వారు సొంతంగా 30, లీజుకు 30 లారీలు సమకూర్చే శక్తి కలిగి ఉండాలి. అయితే వీరు కాగితాల్లో సామర్థ్యాన్ని చూపుతూ టెండర్లు కైవసం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి, వాస్తవంగా టెండర్లో చూపిన లారీలు క్షేత్రస్థాయిలో ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రవాణా శాఖ అధికారులు జోక్యం చేసుకొని ఇతర లారీలను అందుబాటులో తెచ్చుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సన్నవడ్లకు డిమాండ్ బాగా ఉండటంతో మిల్లు యజమానులు సొంత వాహనాలను కొనుగోలు కేంద్రాలకు పంపుతున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఈ డబ్బులు ట్రాన్స్పోర్టర్లకు మిగిలిపోతున్నాయి. ఇలా కాంట్రాక్టర్లు లాభ పడుతున్నా.. సరైన సేవలు అందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క ఎగుమతి, దిగుమతులకు సరైన హమాలీలను సమకూర్చడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలంకావడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
వానొస్తే ఖతమే..
రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేచిచూస్తున్న రైతులు.. ఏ సమయాన వర్షం పడుతుందోనని భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. సాయంత్రం అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులకు భయాందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ తరహా ఇబ్బందులు ఉన్నాయని, బీఆర్ఎస్ హయాంలో కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని అంటున్నారు. వర్షం వస్తే మా కష్టం నీళ్లపాలవుతుందనే భయంలో ఉన్నామని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు త్వరితగతిన కొనుగోళ్లు చేపట్టి ధాన్యాన్ని తరలించాలని చేతులెత్తి వేడుకుంటున్నారు.
పదిరోజులుగా పడిగాపులు కాస్తున్నాం..
మధిర మార్కెట్ యార్డుకు ధాన్యాన్ని తీసుకొచ్చి పదిరోజులు గడుస్తున్నాయి.. లారీలు రాకపోవడంతో ఇక్కడే పడిగాపులు కాస్తున్నాను. మారెట్ యార్డులో ధాన్యం రాశులు కుప్పలుగా పేరుకుపోయాయి. ఇకడ కనీస వసతులు కూడా లేవు.. ఎండలోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను.
– షేక్ కరీముల్లా, రైతు, మడుపల్లి, మధిర మండలం
భారీగా తరుగు తీస్తున్నారు..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో భారీగా తరుగు తీస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బస్తాకు 6 నుంచి 8 కిలోల వరకు కోత విధించడం బాధగా ఉంది. ఇది కొనుగోలు కేంద్రాల్లో ముమ్మాటికీ దోపిడీనే. ఇంత తరుగు తీస్తున్నప్పటికీ కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇది దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం అన్నట్లుగా ఉంది.
– బానోత్ బాలూనాయక్, రైతు, బంజారా కాలనీ, మధిర మండలం