Maha Shivaratri | శివ పూజకు వేళైంది.. ఆలయాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ ముస్తాబయ్యాయి. మహాశివరాత్రి, శని త్రయోదశి కలిసి శనివారమే వచ్చాయి. ఇది 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహిమాన్విత పర్వదినమని వేద పండితులు పేర్కొంటున్నారు. అన్ని ప్రముఖ ఆలయాల్లోనూ జాతర, జాగరణకు ఆలయ కమిటీల బాధ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శివ భక్తులకు ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి రోజున శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడనున్నాయి. ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేశాయి.
ఖమ్మం కల్చరల్/ కూసుమంచి/ పెనుబల్లి/ మధిర/ అన్నపురెడ్డిపల్లి/ చింతకాని/ చండ్రుగొండ/ దమ్మపేట/ జూలూరుపాడు/ సారపాక/ బూర్గంపహాడ్/ తిరుమలాయపాలెం/ వైరా రూరల్/ చుంచుపల్లి, ఫిబ్రవరి 17: ‘ఓం నమో శివ రుద్రాయ.. ఓం నమో శితి కంఠాయ.. ఓం నమో హర నాగాభరణాయా.. ప్రణవాయా..’ అంటూ నీలకుంఠుడి భక్తిగీతాలు మార్మోగుతున్నాయి. నీలకంఠుడి భక్తులందరూ తన్మయత్వం చెందుతున్నారు. మహాశివరాత్రి పర్వదినానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ ముస్తాబయ్యాయి. మహాశిరాత్రి, శని త్రయోదశి కలిసి శనివారమే వచ్చాయి. ఇది 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహిమాన్విత పర్వదినమని వేద పండితులు పేర్కొంటున్నారు. అన్ని ప్రముఖ ఆలయాల్లోనూ జాతర, జాగరణకు ఆలయ కమిటీల బాధ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శివ భక్తులకు ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి రోజున శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడనున్నాయి. ఇదే రోజున మరో అరుదైన విశేషం కూడా ఉన్నది. ప్రతి 12 పుష్కరాలకు అంటే 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇచ్చే మహిమాన్వితమైన మహాశివరాత్రి, శని త్రయోదశి కలిసి రావటం చాలా విశేషమని వేదపండితులు చెబుతున్నారు. ఖమ్మంలోని శ్రీబ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయం సహా ఇతర ఆలయాలన్నీ పండుగ శోభను సంతరించుకున్నాయి.
ముస్తాబైన నీలాద్రి..
ఈ నెల 19 వరకు అంగరంగ వైభవంగా జరుగనున్న నీలాద్రి జాతర, శివపార్వతుల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాకతీయుల కాలంనాటి సుప్రసిద్ధ, విశిష్టత కలిగిన ఈ నీలాద్రీశ్వర ఆలయానికి చేరుకునేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు.
108 శివలింగాలు..
అన్నపురెడ్డిపల్లిలోని శ్రీబ్రమరాంబ సమేత శ్రీమల్లికార్జునస్వామి దేవాలయం ప్రముఖ శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. 108 శివలింగాలతో కూడిన పెద్ద శివలింగం ఆకారంలో నిర్మితమైన ఈ శివాలయం కాకతీయుల కాలం నాటిది. ఇక్కడ నిర్మించిన భారీ నందీశ్వరుడుడి విగ్రహం, స్వామి వారి కల్యాణ మండపం, పుష్కరణి, శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నవగ్రహాలు, కాలభైరవస్వామి, ప్రత్యేక నిర్మాణాలు, సువిశాలమైన ఆలయ ప్రాంగణంలో దేవతామూర్తులు విగ్రహాల కట్టడాలు, శివపార్వతులు, దక్షిణామూర్తి, భక్త కన్నప్ప, మార్కండేయుడు, శ్రీఆంజనేయ స్వామి విగ్రహాలు జీవ కళను ఉట్టిపడుతూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
కాశీ పవిత్రత కలిగిన మధిర శ్రీమృత్యుంజయస్వామి..
కాశీ పవిత్రత కలిగిన శ్రీమృత్యుంజయస్వామి ఆలయం మధిర నియోజకవర్గంలోనే ఎంతో ప్రత్యేకమైనది. మధిర పట్టణంలో ఉన్న ఈ ఆలయానికి ఒకవైపు వైరా నది, మరోవైపు శ్మశానవాటిక ఉన్నాయి. మృత్యుంజస్వామివారి గర్భగుడికి నాలుగువైపులా ద్వారాలు కలిగి ఉండడం విశేషం. ఈ ఆలయం వద్ద ప్రతీ సంవత్సరం ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా శివరాత్రి మహోత్సవాలు జరుగడం ఆనవాయితీ.
మరికొన్ని ప్రముఖ ఆలయాల్లో..
ఆయా మండలాల్లో ఉన్న ఆలయాలూ మహాశివరాత్రికి ముస్తాబయ్యాయి. అశ్వారావుపేట మండలంలో శ్రీమల్లేశ్వరస్వామి, శ్రీయంత్రరాజసహిత కాళేశ్వరస్వామి, కాశీనాథుని ఆలయాలు, ములకలపల్లిలోని శ్రీ ఉమా పృథ్వీ రామలింగేశ్వరస్వామి ఆలయం, చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెంలోని త్రిమూర్తుల ఆలయం ఎంతో ప్రత్యేకమైనవి. బెండాలపాడు కనిగిరి గుట్టలపై ఉన్న వీరభద్రుని ఆలయంలో శివపార్వతుల కల్యాణం ఏటా వైభవంగా జరుగుతుంది.
చింతకాని మండలం నేరడ, కొదుమూరు, నాగిలిగొండ, వందనం, పందిళ్లపల్లి ఆలయాలు, దమ్మపేట మండలంలో జగదాంబసమేత జయలింగేశ్వరస్వామి, దుర్గామల్లేశ్వరస్వామి, అన్నపూర్ణ సహిత విశేశ్వరస్వామి ఆలయాలు, టేకులపల్లి మండలం కొత్త కొండ వీరభద్ర స్వామి ఆలయం, జూలూరుపాడు మండలం శ్రీ ఉమాసోమలింగేశ్వరస్వామి ఆలయం, నేలకొండపల్లి మండలం శ్రీఉత్తరేశ్వరస్వామి, శ్రీభీమేశ్వరస్వామి, శ్రీవైద్యనాథస్వామి ఆలయాలు, పెనుబల్లి మండలం పులిగుండం శివాలయం, నీలాద్రి శివాలయం, మర్లకుంట బ్రమరాంబ ఆలయం, బూర్గంపహాడ్ మండలం మోతేపట్టీనగర్లో పవిత్ర గోదావరి తీరాన కొలువైన శ్రీవీరభద్రుని ఆలయం, తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు, సుబ్లేడు, బీరోలు ఆలయలు, వైరా మండలం స్నానాల లక్ష్మీపురం శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం, చుంచుపల్లి మండలం గౌతంపూర్ శ్రీ కనకదుర్గ చంద్రమౌలీశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబయ్యాయి.
తీర్థాలలో నేడు స్వామివారి కల్యాణం
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 17: మండలంలోని తీర్థాల సంగమేశ్వర దేవాలయంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఐదురోజుల పాటు సాగే ఈ జాతర శుక్రవారం నుంచి ప్రారంభమైంది. సాధారణ, ప్రత్యేక, వీఐపీ భక్తుల కోసం నిర్వాహకులు వేర్వేరుగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి కూడా ఈ జాతర విజయవంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. తొలి పూజు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. శనివారం అర్ధరాత్రి 12 గంటలకు స్వామి వారి కల్యాణం జరుగనుంది.