భద్రాచలం, డిసెంబర్ 30: భద్రాద్రి దివ్యక్షేత్ర సన్నిధిలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. ఎనిమిదోరోజు స్వామివారు బలరామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి ఆరాధన, ఆరగింపు, సేవాకాలం, నిత్య బలిహరణం, నిత్య హోమాలు, నిత్య పూజలు నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆండాళ్ తల్లికి 30 ద్రావిడ పాశురాలు విన్నవించారు. అనంతరం మంగళవాద్యాలు, మేళతాళాలు, కోలాట నృత్యాల మధ్య స్వామివారిని మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. స్వామివారిని భక్తులు దర్శించుకున్న తర్వాత తాతగుడి సెంటర్కు తిరువీధి సేవ నిర్వహించారు. శనివారం స్వామివారు శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమాల్లో దేవస్థానం ఈవో శివాజీ, ఏఈవో శ్రావణ్కుమార్, ఆస్థాన స్థానాచార్యుడు కేఈ స్థలశాయి, ఆలయ సూపరింటెండెంట్ కత్తి శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు, అర్చక సిబ్బంది, వైదిక సిబ్బంది పాల్గొన్నారు.
పర్ణశాల, డిసెంబర్ 30: పర్ణశాల సీతారామాలయంలో శుక్రవారం స్వామివారు ముక్కోటి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు బలరామావతారంలో దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.