ఖమ్మం : రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్లో మట్టి తవ్వకాలపై లోకాయుక్త చేపట్టిన విచారణ బుధవారం ముగిసింది. తెలంగాణ స్టేట్ ఇన్వెస్టిగేషన్ అధికారి మాత్యూకోషి రెండోరోజు మండల పరిషత్ కార్యాలయంలో రెవిన్యూ, మైనింగ్ అధికారులతో కలిసి విచారణ నిర్వహించారు. బాధితులు, క్వారీ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. క్వారీ నిర్వహణ సమయంలో సామాజిక కార్యకర్తగా ఉన్న భానోతు భద్రూనాయక్ సంఘం పేరుతో రూ.2లక్షలు డిమాండ్ చేశాడని, ఇవ్వకుంటే లోకాయుక్త ను ఆశ్రయిస్తామని బెదిరింపులకు గురి చేసి ఇబ్బందులు పెట్టారని క్వారీ అనుమతులు పొందిన రావెళ్ల అశోక్, సయ్యద్ షపీలు విచారణ అధికారి మాత్యూకోషికి ఫిర్యాదు చేశారు.
అంతేకాక రెవిన్యూ పరిధిలోని 266సర్వే నెంబర్లో భూములను కలిగిన రైతులు సైతం తమ భూములను చదును చేయిస్తానని భద్రూనాయక్ అనే వ్యక్తి మా వద్దకు వచ్చి డబ్బులు డిమాండ్ చేశాడని, కాదంటే మీకు భూములు లేకుండా చేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన లోకాయుక్త ఇన్వెస్టిగేషన్ అధికారి మాత్యూకోషి విచారణ నివేధికను లోకాయుక్త కమీషన్కు సమర్పించడం జరుగుతుందన్నారు. ఫీల్డ్ ఎక్వైరీతో పాటు ఇరువర్గాల నుంచీ ఫిర్యాదులను స్వీకరించినట్లు చెప్పారు. కొద్ది మొత్తంగా క్వారీలో అక్రమ తవ్వకాలు జరిగినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ ఎంక్వైరీలో మైనింగ్ ఏడీఈ సంజయ్ కుమార్, తహసీల్దార్ నర్సింహారావు, గిర్ధావర్ శ్రావణ్ కుమార్, రైతులు పాల్గొన్నారు.