మధిర, జూన్ 12 : మధిర మున్సిపల్ పాలకవర్గం ముగ్గురు నలుగురు నాయకుల చేతిలో బందీగా మారిందని, డెవలప్మెంట్ కమిటీ పేరుతో ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గానికి సంకెళ్లు వేశారని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల్ కమల్ రాజు ఆరోపించారు. మధిరలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వార్డు కౌన్సిలర్లకు ఎలాంటి అధికారాలు లేకుండా చేసి, కేవలం డెవలప్మెంట్ కమిటీ పేరుతో వేళ్లు చూపిస్తూ ఫొటోలు దిగితే సరిపోతుందా అని ప్రశ్నించారు.
డెవలప్మెంట్ కమిటీ పేరుతో హల్చల్ చేయిస్తున్న భట్టి విక్రమార్క.. నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఎమ్మెల్యేలకు కాకుండా వారికే బాధ్యతలు అప్పగించవచ్చు కదా అని ప్రశ్నించారు. ఇకనైనా కౌన్సిలర్లను డమ్మీలను చేయకుండా వారికి రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్త పాలకవర్గం ఏర్పడి నాలుగు నెలలు గడుస్తున్నా కనీసం తట్టెడు మట్టి పోసి డ్రైనేజీ గుంతలను కూడా పూడ్చలేకపోయారని విమర్శించారు.
బీఆర్ఎస్ నాయకులు పల్లపోతు వెంకటేశ్వరరావు, అరిగే శ్రీనివాసరావు, బొగ్గుల భాసర్రెడ్డి, బికి కృష్ణప్రసాద్, వైవీ అప్పారావు, చిత్తారు నాగేశ్వర రావు, అయిలూరి ఉమామహేశ్వర్రెడ్డి, ధీరావత్ మాధవి, అంగడాల పార్వతి, సయ్యద్ ఇక్బాల్, కోటారు రాఘవరావు, కుర్ర రంజిత్, ఆళ్ల నాగబాబు, పరిస శ్రీనివాసరావు, బొగ్గుల వీరారెడ్డి, చీదిరాల రాబాబు, చారుగుండ్ల నరసింహమూర్తి, భువనగిరి నారాయణరావు, చక్రం, అబ్దుల్ ఖురేషి, వీరంశెట్టి సీతారామయ్య, నాగులవంచ రామారావు తదితరులు పాల్గొన్నారు.