‘చిన్నతనం నుంచే పఠనాసక్తి పెంచాలి. తాము చదివే తరగతి పుస్తకాలతోపాటు లోక జ్ఞానంపై ఔపోసన పట్టాలి. విజ్ఞానాన్ని పెంచుకోవాలి. భవిష్యత్కు అవసరమయ్యే జ్ఞాన సముపార్జనకు పునాదులు వేసుకోవాలి. ఇది నిరంతర ప్రక్రియలా కొనసాగించాలి’ అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నది. దీనిలో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయ నిర్వహణ చేపడుతున్నది. ఈ మేరకు ర్యాక్లు, పుస్తకాలను పంపిణీ చేస్తున్నది. ఈ మేరకు సోమవారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు పాఠశాలల్లో గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నది.
– ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 9
ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 9: ‘విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించాలి.. వివిధ రకాల పుస్తకాలు చదవాలి.. విజ్ఞానాన్ని పెంపొందించుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిచాలి’ అనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 10 నుంచి 15 వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జడ్పీ, రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, కేజీబీవీల్లో వారోత్సవాలు నిర్వహించనున్నది. వేడుకలను జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి కేశవపట్నం రవికుమార్ పర్యవేక్షించనున్నారు. సర్కార్ ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయానికి ఒక గది కేటాయించాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన సామగ్రి, పుస్తకాలను సమకూర్చింది. ఈమేరకు పాఠశాల యాజమాన్యాలు పాఠశాలల్లో గ్రంథాలయ గదులను ఏర్పాటు చేశాయి.
10వ తేదీన.. పఠనోత్సవం, గ్రంథాలయ వారోత్సవాలను సూచిస్తూ యాజమాన్యం ఫ్లెక్సీ సిద్ధం చేయాలి. పాఠశాలలో ప్రదర్శనకు ఉంచాలి. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పఠన ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించేలా కార్యక్రమం నిర్వహించాలి. పిల్లలతో పుస్తక పఠనం చేయించాలి.
11న.. పుస్తక పఠనం ఆవశ్యకతను చాటిచెప్పేందుకు గ్రామంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించాలి. శుభకార్యాలు, జన్మదినాల సందర్భంలో విద్యార్థులకు గిఫ్ట్ ఇచ్చే సంస్కృతిని పాటించాలని తల్లిదండ్రులకు సూచించాలి.
12, 13వ తేదీల్లో.. పాఠశాల గ్రంథాలయానికి పుస్తకాలు సేకరించాలి. అందుకు యాజమాన్యాలు దాతల సాయం కోరాలి. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉపయోగపడే కథల పుస్తకాలు, వార్త పత్రికల్లో ప్రచురితమయ్యే కథలు, బొమ్మలు, పజిల్స్ను సేకరించాలి.
14న.. పఠన సామగ్రి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. విద్యార్థులతో పేపర్ కటింగ్స్, కార్టూన్స్, పజిల్ కార్డులను తయారు చేయించాలి. ఒక్కో పాఠశాల కనీసం వందకు తగ్గకుండా అభ్యాసన సామగ్రి సిద్ధం చేయాలి.
15న.. పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలి. పిల్లలతో పుస్తక పఠనం చేయించాలి. పఠన పోటీలు నిర్వహించాలి. పిల్లలు సొంతంగా కథలు చెప్పే విధంగా ప్రోత్సహించాలి.