Khammam | అడవికి వేసవి అత్యంత ప్రమాదకరం.. ఈ సీజన్లో అటవీప్రాంతంలోని వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న పొదలు, గడ్డిపోచలు, కొన్ని రకాల చెట్లు ఎండిపోతాయి.. ఇదే సమయంలో ఎవరైనా ఆకతాయిలు నిప్పు రాజేసినా, ధూమపానం చేసే వారు అగ్గి పుల్ల లేదా బీడీ, సిగరేట్ను అజాగ్రత్తగా విసిరినా క్షణాల్లో అగ్గి రాజుకుంటుంది.. నిమిషాల్లోనే అది దావానలం అవుతుంది.. అడవినంతా బుగ్గి పాలు చేస్తుంది.. పచ్చటి మొక్కలు, చెట్లు వికసించాల్సిన చోట బూడిద మిగులుతుంది..
అలాంటి విపత్తును తప్పించుకోవాలంటే కార్యాచరణ పకడ్బందీగా ఉండాలి.. అటవీశాఖ ప్రస్తుతం ఆ పనిలో నిమగ్నమైంది.. సమ్మర్ దృష్ట్యా కార్చిచ్చు నివారణకు భద్రాద్రి జిల్లాకు ప్రత్యేకంగా ఎనిమిది బృందాలను నియమించింది.. బృంద సభ్యులు నిత్యం ఫారెస్ట్లో పర్యటించి, జల్లెడ పట్టి అటవీప్రాంతాన్ని కాపాడాల్సి ఉంటుంది.. ఎక్కడ ఏ చిన్న అగ్గి పుట్టినా అదుపు చేయాల్సి ఉంటుంది.. అటవీశాఖ తీసుకుంటున్న చర్యలపై నేటి ప్రత్యేక కథనం.
లక్ష్మీదేవిపల్లి, మార్చి 5 : అడవిలో కార్చిచ్చు వ్యాపించేందుకు అనేక కారణాలను చెప్పకోవచ్చు. జిల్లాలో సుమారు 4.30 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. ప్రతి వేసవిలో అడవికి కార్చిచ్చు ప్రమాదం పొంచి ఉంటున్నది. అయితే అడవిలో అగ్నిప్రమాదా లు చోటుచేసుకునేందుకు ప్రథమ కారణం మాత్రం మనుషులే. అటవీ ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో బీడీలు, సిగరెట్లు తాగి కింద పడేస్తుంటారు. ఇది రాజుకొని చిన్న మంటగా మొ దలై కార్చిచ్చుగా వ్యాపిస్తుంది. కొంతమంది అడవిలో సంచరి స్తూ వంటలు చేసుకుని నిప్పును పూర్తిగా ఆర్పివేయకుండానే వెళ్లిపోతుంటారు.
ఈ విధంగా కూడా నిప్పు వ్యాపిస్తుంది. వేసవికావడంతో మంటలు సులువుగా వ్యాపిస్తుంటాయి. అలాగే వేసవిలో చెట్ల ఆకులు ఎండి రాలిపోతుంటాయి. అటవీ ప్రాంతంలో కింద మొత్తం ఎండిపోయిన ఆకులు ఉండడం.. అడవిలో పెద్ద పెద్ద గుట్టలు ఉన్న సమయంలో గుట్టలపై నుంచి రాళ్లు జారిపడుతూ అవి రాసుకోవడం వల్ల నిప్పు రవ్వలు ఎగిసి ఎండుటాకులపై పడడంతో మంటలు వ్యాపిస్తుంటాయి. అటవీప్రాంతం సమీపంలో పొలాలు ఉన్న రైతులు చెత్తను తగలబెట్టిన సమయంలో నిప్పు రవ్వలు అడవిలో పడి అగ్ని రాజుకుంటుంది.
జిల్లాలో కిన్నెరసాని అభయారణ్యంతోపాటు ఆళ్లపల్లి, గుండాల, ఇల్లెందులో అటవీప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో అరుదైన చెట్లతోపాటు జంతువులు, పక్షులు సంచరిస్తుంటాయి. కార్చిచ్చు వ్యాపిస్తే అడవిలోని చెట్లు కాలిపోయే ప్రమాదం ఉంది. అగ్నిప్రమాదాల వల్ల అడవికి సమీపంలో నివసించే గొత్తికోయలు, పోడు కొట్టి వ్యవసాయం చేసుకునే వారికి ఇబ్బంది తలెత్తుతుంది. వారి గుడిసెలపై నిప్పు రవ్వలు పడితే పూర్తిగా దగ్ధమయ్యే ప్రమాదం ఉంది. దీంతో అటవీశాఖ ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. అడవులను రక్షించుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
అటవీ సమీప గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిప్పులు రాజేయవద్దని, సిగరెట్లు, బీడీలు కాల్చి పడేయవద్దని చెబుతున్నారు. పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా బేస్క్యాంప్ టీమ్లను ఏర్పాటు చేశారు. ఈ టీమ్ వన్యప్రాణుల సంరక్షణతోపాటు అటవీ సంరక్షణ కోసం పనిచేస్తాయి. ఈ టీమ్లో ఐదుగురు సభ్యులు ఉంటారు. వీరిని అటవీ అధికారులు అవుట్ సోర్సింగ్ విధానంలో ఎంపిక చేస్తారు. వారికి కావాల్సిన భోజన, క్యాంప్ వసతి అన్ని కల్పిస్తూ వారు అటవీ ప్రాంతంలోనే ఉండేలా చర్యలు తీసుకుంటారు. వీరు పగలు, రాత్రి అటవీ ప్రాంతంలోనే గస్తీ తిరుగుతూ అడవి, వన్యప్రాణులను కాపాడుతారు. అలాగే ట్రాక్టర్లతో పిక్స్లో నీటిని నింపుతారు. మంటలు వ్యాపించకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటారు.
అగ్నిప్రమాదాలను నివారించేందుకు అటవీశాఖ 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. జిల్లావ్యాప్తంగా ఈ బృందాలు సంచరిస్తూ పరిశీలిస్తుంటాయి. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులు ఉండగా.. బృందానికి ఒక వాహనాన్ని కేటాయించారు. వీరు తమకు కేటాయించిన అటవీ ప్రాంతంలో నిత్యం తిరుగుతుంటారు. వీరికి అగ్నిప్రమాద నివారణకు సంబంధించిన సామగ్రిని కేటాయించారు. గ్లౌజులు, హెల్మెట్లు, బ్లోయర్, ఇతర సామాగ్రిని అందుబాటులో ఉంచారు. వేసవికాలంలో అటవీ సంరక్షణకు ఈ బృందాలు కీలకపాత్ర పోషిస్తాయి.
అడవిని రక్షించుకునేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. వేసవిలో కార్చిచ్చు వ్యాపించకుండా గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే అదుపులోకి తీసుకురావడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. జిల్లాలో ఏయే ప్రాంతాల్లో మంటలు ఎక్కువగా వ్యాపిస్తాయో గుర్తించి అక్కడ ఎక్కువ బృందాలను ఏర్పాటు చేశాం. ప్రజలు కూడా సహకరించాలి. అటవీ ప్రాంతానికి వెళ్లి సిగరెట్లు, బీడీలు తాగి పడేయవద్దు. అలాగే అటవీ ప్రాంతంలో ఫైర్లైన్లను ఏర్పాటు చేస్తున్నాం.
– అప్పయ్య, ఎఫ్డీవో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా