ఖమ్మం, ఏప్రిల్ 27: బీఆర్ఎస్ ఆవిర్భావం చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోతుందని పార్టీ నేతలు పేర్కొన్నారు. 23 ఏళ్ల క్రితం గుప్పెడు మందితో ఉద్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్).. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా రూపాంతరం చెందిందని, నేడు అది తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో పార్టీ నేతలు శనివారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు పార్టీ జెండాను ఆవిషరించారు. అనంతరం నేతలు కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకొని సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకల కార్యక్రమంలో ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. చరిత్ర ఉన్నంతకాలం తెలంగాణ ఉద్యమంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను, వారి త్యాగాలను చరిత్ర ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. తెలంగాణ రథసారథి కేసీఆర్ ఉద్యమాలు, ప్రజల పోరాటాలతో స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసుకున్నామని అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దుకున్నామని గుర్తుచేశారు. ఇకపై కూడా దీనిని కాపాడుకోవడం తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రధానమైన అంశమని అన్నారు. అలాగే, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు సాధించి చరిత్రను తిరగరాస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణ ఎంపీగా తాను మొదటి ఓటు వేయడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లాలో జరిగే పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్రను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్కు ఉందని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని పార్టీ సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తూ.. కార్యాలయంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, టీఎస్ సీడ్స్ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్కు నాగరాజు, బిచ్చాల తిరుమలరావు, ఉప్పల వెంకటరమణ, తాజుద్దీన్, ఉద్యమ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.