ఖమ్మం, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతతో నిరాశ్రయులుగా మారిన పేదలను పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఖమ్మం రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మం చేరుకొని నేరుగా వెలుగుమట్ల భూదాన్ భూముల ప్రాంతానికి వెళతారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత కర్కశంగా కూల్చివేసిన పేదల ఇండ్లను పరిశీలిస్తారు. తర్వాత అంబేద్కర్ భవనం, టీటీడీసీ భవనాల్లో నిరాశ్రయులుగా మారిన పేదలను పరామర్శిస్తారు. ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి అజయ్కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, అక్కడి మాజీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొననున్నట్లు సమాచారం.