కొత్తగూడెం క్రైం, జనవరి 30: కొత్తగూడెం నుంచి బాలికలను అక్రమంగా రవాణా చేయడమేకాక వారిని వ్యభిచార కూపంలోకి దింపిన ముఠాను కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో గతంలోనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా మరో తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. తెలిసిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గణేశ్ బస్తీలో కొందరు వ్యభిచార గృహం నడుపుతున్నారని పోలీసులు సమాచారం అందుకున్నారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మట్టా హరికుమారి ఫిర్యాదు మేరకు గతేడాది జూలై 5న పోలీసులు దాడులు నిర్వహించి బానోత్ కరుణ, బోనం రాణి నుంచి ఇద్దరు బాలికలను కాపాడారు. ఇదే రోజు వ్యభిచార గృహం నిర్వాహకులు, విటులతో కలిపి మొత్తం 15 మందిపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కరుణ, రాణితో పాటు బాలికలను రవాణా చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న మహమ్మద్ షారుఖ్ ఖాన్, మహమ్మద్ అస్గర్ హుస్సేన్, భూక్యా సారయ్యను అదుపులోకి తీసుకున్నారు. బాలికలను రెస్క్యూ హోంకు తరలించారు. వారిని సీడబ్ల్యూసీ సంరక్షణలో ఉంచారు. అనంతరం ఈ కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన దండు వెంకటేశ్, గుత్తుల ప్రవీణ్, గారుగుల రాజేశ్, డీకొండ గణేశ్, యాసరపు కల్యాణ్, అంజత్ ఖాన్, పడిగ ప్రశాంత్, డీకొండ శరత్నాథ్, షేక్ రషీద్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించినట్లు సీఐ అబ్బయ్య తెలిపారు. మొత్తం 15 మందిపై కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 14 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు.