భద్రాద్రి కొత్తగూడెం, జూలై 28 (నమస్తే తెలంగాణ): సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని ఉంటున్న పేదలు.. వాటి క్రమబద్ధీకరణ పట్టాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించినట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెంలోని కలెక్టరేట్లో కలెక్టర్ అనుదీప్తో కలిసి గురువారం నిర్వహించిన ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో ఆరు వేల మందికి 76 జీవో ప్రకారం ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలు అందించినట్లు చెప్పారు. 141, 142, 143 సర్వే నెంబర్లలో ఉన్న భూముల్లో నివాసం ఉంటున్న వారికి క్రమబద్ధీకరణ చేస్తున్నామన్నారు.
వాస్తవానికి దరఖాస్తు గడువు ఈ నెల 26తోనే ముగిసినప్పటికీ.. ఇంకా చేసుకోని వారు, గతంలో రిజెక్టు అయినవారు వచ్చే నెల 12లోపు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ జీవో ద్వారా పట్టాలు క్రమబద్ధీకరణ చేయడం వల్ల వాటిని దానం చేయడం, గిఫ్టుగా ఇవ్వడం, రుణాలు తీసుకోవడం వంటి వెసులుబాట్లు కలుగుతాయన్నారు. అయితే ఇప్పటికిప్పుడు ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి అనుమతులూ లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టకూడదని సూచించారు. గతంలో ఎప్పుడో ఇంటి నిర్మాణం చేసుకున్న వారు మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హులవుతారని అన్నారు.
సింగరేణి ప్రాంత వాసులకే..
అనంతరం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. ఈ పట్టాల క్రమబద్ధీరణ సింగరేణి ప్రాంతాల్లో ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని అన్నారు. ఇప్పటి వరకు 7,046 మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో 4,749 మంది దరఖాస్తులు ఆమోదం పొందాయని అన్నారు. వారిలో 4,640 మందికి పట్టాలు పంపిణీ చేశామని, వారిలో 4,186 మంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారని వివరించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్స్న్ కాపు సీతాలక్ష్మి, కమిషనర్ అనిల్, తహసీల్దార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.