పిల్లల ప్రాణాలను తీస్తున్న ఈత
కన్నవాళ్లకు కడుపు కోత.. తీరని వ్యథ
మృత్యుతీరాలుగా చెరువులు, నదులు
తల్లిదండ్రులారా తస్మాత్ జాగ్రత్త..!
పిల్లలపై కన్నేసి ఉంచండి.. వారి ప్రాణాలను కాపాడండి..
జూలూరుపాడు మండలం పాపకొల్లుకు చెందిన పూరేటి బాబూరావు(40), రాయి నర్సింహారావు అలియాస్ ముత్తయ్య (35) మరికొందరితో కలిసి బోజ్యాతండాకు చెందిన ఓ రైతు పొలంలో ఎరువు తోలకానికి వచ్చారు. మధ్యాహ్నం వంట వండుకోవడానికి సీతారామ ప్రాజెక్టు కాలువ ప్రాంతానికి వచ్చారు. కాలువ పరిసర ప్రాంతాల్లో వంట కోసం కట్టెలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో బాబూరావు, ముత్తయ్యకు ఈత కొట్టాలనిపించింది. ఇద్దరూ నీటిలో దిగారు. కాలువ ప్రవాహానికి గల్లంతయ్యారు. ఎంతసేపటికీ బాబూరావు, ముత్తయ్య రాకపోయేసరికి తోటి కూలీలు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీతారామ ప్రాజెక్టు కాలువ గట్టపై బాబూరావు, ముత్తయ్య చెప్పులు, దుస్తులు గుర్తించి కాలువలో గల్లంతయ్యారని నిర్ధారణకు వచ్చారు. మరుసటి రోజు బాబూరావు, ముత్తయ్య మృతదేహాలు కాలువలో లభించాయి. వారిద్దరి మరణం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 9 (నమస్తే తెలంగాణ): అంతవరకు తరగతి గదులు, హాస్టల్స్, కోచింగ్ అంటూ చదువులకే పరిమితమైన పిల్లలకు వేసవి సెలవులు చక్కటి విడిది. ఇంటిల్లిపాదితో సరదాగా గడిపే రోజులవి. అలాంటి హ్యాపీ డేస్ విషాదంతో ముగియకూడదు. ఒక ఈత సరదా ప్రాణాలను కబళించకూడదు. నీళ్లను చూస్తే కొందరికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. దానికి చిన్నాపెద్దా తేడా లేదు. ఈతకు వెళ్లి గల్లంతై మృత్యువాత పడేవారిలో పిల్లలే కాదు. పెద్దలూ ఉంటున్నారు. అందుకు ఇటీవల భద్రాద్రి జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలే తార్కాణం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త.
సరదాగా మొదలై విషాదం వైపు..
సాధారణంగా ఈతకు వెళ్లే పిల్లల మానసిక స్థితి ఇలా ఉంటుంది. ఇంతకు ముందు ఎన్నోసార్లు ఈతకు వెళ్లాం కదా.. ఇప్పుడు వెళ్తే ఏమవుతుంది.. నా వెంట ఈత వచ్చిన వాళ్లు చాలా మంది ఉన్నారు కదా.. వాళ్లుండగా ప్రమాదం ఎందుకు ఎదురవుతుంది.. ఈతకు వెళ్తామని అమ్మనాన్నకు చెప్తే తిడతారు. వాళ్లకు చెప్పొద్దు. ఇలా వెళ్లి అలా ఇంటికి తిరిగి వచ్చేద్దాం.. వేసవి సెలవుల్లో తప్పితే ఎప్పుడు ఈతకు వెళ్తాం. సెలవులు అయిపోతున్నాయి కదా.. ఇప్పటికైనా వెళ్లకపోతే ఎలా.. ఇలా తమకు తామే సమాధానం చెపుకుంటూ స్నేహితులంతా చెరువులు లేదా సమీపంలోని నదులు లేదా పంట కాలువల వద్దకు వెళ్తున్నారు.
జిల్లాలో ఇల్లెందు, మణుగూరు, అశ్వారావుపేట, దమ్మపేట మండలంలోని చెరువులు, ములకలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్టు, గుండాల ప్రాంతంలోని ఏడుపాయల ప్రాంతాల వద్ద ఎక్కువ మంది గల్లంతై మృత్యువాత పడ్డారు. గోదావరి పాపికొండల యాత్రలోనూ అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గోదావరి పరివాహకమైన అశ్వాపురం, బూర్గంపాడు మండలంలోని మోతే ప్రాంతంలోనూ మరణాలు సంభవించాయి. పర్యాటకులకు పర్ణశాల వద్ద గోదావరి, కిన్నెరసాని రిజర్వాయర్లో ప్రస్తుతం బోటు షికారు సౌకర్యం ఉంది. ఆయా ప్రాంతాల్లో విహార యాత్రకు వెళ్లే వారు కచ్చితంగా సెఫ్టీ మెజర్స్ తీసుకోవాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ..
వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు పిల్లలను కదలికలను గమనించాలి. సమీపంలో చెరువులు, నదులు ఉంటే వాటి వద్దకు వెళ్లవద్దని ముందుగానే చెప్పాలి. ఈతకు ప్రేరేపిస్తున్న స్నేహితులను గుర్తించాలి. వారికీ నచ్చజెప్పాలి. అవసరమైతే వారికి దూరంగా ఇతర పిల్లలను ఉంచాలి. సుశిక్షితులైన శిక్షకులు నడుపుతున్న స్విమ్మింగ్ పూల్స్లోనే పిల్లలకు ఈత నేర్పించాలి. లైఫ్ జాకెట్స్ ధరించే పిల్లలు ఈత నేర్చుకునేలా జాగ్రత్త వహించాలి. బోటు షికారుకు వెళ్లినప్పుడు ప్రతిఒక్కరూ కచ్చితంగా లైఫ్ జాకెట్లు ధరించాలి.
తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలి..
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పిల్లలు చుట్టపక్కన ఉన్న చెరువుల్లో ఈత కొట్టడానికి ఆసక్తికనబరుస్తారు. తోటి స్నేహితులతో కలిసి వెళ్తారు. తల్లిదండ్రులు పిల్లలను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలి. వారిని నీటి జోలికి వెళ్లకుండా కట్టడి చేయాలి. వారికి స్విమ్మింగ్ పూల్స్లోనే ఈత నేర్పించాలి. నిపుణులు, శిక్షకులు లేనిదే వారిని నీళ్ల వద్దకు వెళ్లనీయకూడదు.
– ఆర్.వరలక్ష్మి, డీడబ్ల్యూవో, కొత్తగూడెం
చెరువులు, నదుల వద్ద బారికెడ్లు ఉండాలి…
ప్రమాద ఘటనలు జరుగుతున్న చెరువులు, న దుల ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు బారికెడ్లు ఏ ర్పాటు చేయాలి. అవసరమైతే హెచ్చరిక బోర్డులు పెట్టాలి. పిల్లలు స్విమ్మింగ్ పూల్స్లోనే ఈత నే ర్చుకోవాలి. లైఫ్ జాకెట్స్ ధరించాలి. తల్లిదండ్రు లు పిల్లలకు కచ్చితంగా ఈత నేర్పించాలి. ఈత జీవితంలో ఏదో ఒక సమయంలో మన ప్రాణాలను కాపాడుతుందని గుర్తించాలి. –గుడ్ల వెంకటేశ్వర్బాబు, డీఎస్పీ, కొత్తగూడెం
పిల్లలకు ఈత నేర్పాలి..
తల్లిదండ్రులు పిల్లలకు కచ్చితంగా ఈత నేర్పాలి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రీడాప్రాంగణాల్లో స్విమ్మింగ్ పూల్స్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వ్యాయామ ఉపాధ్యాయులు పిల్లలకు ఆటలతో పాటు ఈత నేర్పించాలి. ఆపద సమయాల్లో తమను తాము రక్షించుకునేందుకైనా ఈత ఉపయోగపడుతుంది. – యార్లగడ్డ వెంకటేశ్వరరావు, మారథాన్ రన్నర్, కొత్తగూడెం