ఖమ్మం, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ఖమ్మం జిల్లా అగ్రగామిగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ కారణంగా గడిచిన 9 ఏళ్లలో చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తుచేశారు. భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం నిర్వహించిన వేడుకల్లో మంత్రి పోలీసు గౌరవ వందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జిల్లా అభివృద్ధి గురించి ప్రసంగించారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని గుర్తుచేశారు. స్వాతంత్య్ర పోరాటంలో ఖమ్మం జిల్లా కూడా విశిష్ట స్థానం కలిగి ఉందని గుర్తుచేశారు.
అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు
ఖమ్మం జిల్లాలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయడంతోపాటు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ప్రభుత్వం అప్గ్రేడ్ చేసిందని అన్నారు. ‘మన ఊరు మన బడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. సీతారామ – పాలేరు లింక్ కాలువల ద్వారా జిల్లాలో 47,381 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నామని అన్నారు. రైతుబంధు 11వ విడతలో భాగంగా 3,06,709 మంది రైతుల ఖాతాల్లో రూ.268.55 కోట్ల పంటల పెట్టుబడి సాయాన్ని జమ చేసినట్లు వివరించారు. రైతుబీమా కింద జిల్లాలో 791 క్లెయిమ్లకు గాను రూ.39.55 కోట్లను నామినీలకు అందించినట్లు చెప్పారు. 2014 నుంచి 2018 మధ్య రైతులు బ్యాంకుల్లో తీసుసుకున్న రూ.లక్ష లోపు పంట రుణాలను ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసినట్లు తెలిపారు. బీసీ కులాల్లోని వృత్తిదారుల్లో 14,808 మందిని అర్హులుగా గుర్తించామని, ప్రతి నెలా 15 వేల మందికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీలో 16,744 యూనిట్లను మంజూరు చేశామన్నారు. మైనార్టీలకు రూ.లక్ష సాయం కింద జిల్లాలో 600 మందికి ఆర్థిక చేయూతను అందిస్తున్నామని అన్నారు. గృహలక్ష్మి పథకం కింద అర్హులైన వారిని గుర్తించి ఒక్కో లబ్ధిదారుకు రూ.3 లక్షల చొప్పున అందించనున్నట్లు చెప్పారు.
ధరణి ద్వారా అనేక ప్రయోజనాలు..
సమీకృత భూమి రికార్డుల నిర్వహణ వ్యవస్థలో భాగంగా ప్రభుత్వం ధరణి పోర్టల్ను ప్రవేశ పెట్టిందని మంత్రి అజయ్ పేర్కొన్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్, ల్యాండ్ మ్యూటేషన్, ల్యాండ్ రికార్డ్ సెర్చ్, ఇతర భూ సంబంధిత సేవలన్నీ ధరణి పోర్టల్ ద్వారా అందుతున్నాయని అన్నారు. 2023-24లో జిల్లా అభివృద్ధి కోసం రూ.31.74 కోట్ల నిధులు విడుదలైనట్లు చెప్పారు. 25 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేశామన్నారు.
మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు
జిల్లాలో మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఖమ్మంలో రూ.100 కోట్లతో చేపట్టిన గోళ్లపాడు కాలువ ఆధునీకరణ పనులు తుది దశలో ఉన్నాయన్నారు. సత్తుపల్లిలో రూ.2.05 కోట్లతో కాకర్లపల్లి, అవణి జేవీఆర్ పార్కులను అభివృద్ధి చేశామన్నారు. మధిరలో రూ.4.50 కోట్లతో సమీకృత మార్కెట్ను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించామన్నారు. వైరాలో 12 స్వచ్ఛ ఆటోలు, 7 ట్రాక్టర్లు, 3 ట్రాలీలు, 1 వాటర్ ట్యాంకర్, 1 డోజర్, 1 జేసీబీ కొనుగోలు చేసినట్లు వివరించారు.
సాతంత్య్ర సమరయోధులకు సత్కారం
ఈ సందర్భంగా పలువురు స్వాతంత్య్ర సమరయోధులను మంత్రి సత్కరించారు. ఎమ్మెల్సీ తాతా మధు, కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ సీపీ విష్ణు, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా, డీసీసీబీ, ఏఎంసీ చైర్మన్లు విజయ్కుమార్, నాగభూషణం, దోరేపల్లి శ్వేత, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.