ఖమ్మం రూరల్/ ముదిగొండ, మార్చి 2 : పట్టువదలక ప్రయత్నిస్తే ప్రభుత్వ కొలువులు సాధించడం పెద్ద కష్టతరమేమీ కాదని నిరూపించారు ఖమ్మం రూరల్, ముదిగొండ మండలాలకు చెందిన ఇద్దరు మహిళలు. ఆత్మవిశ్వాసం, కుటుంబ ప్రోత్సాహం ఉంటే ఇంటా బయటా పనులు చక్కదిద్దుకొని మరీ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చునని, పోస్టులు సాధించవచ్చునని ప్రూఫ్ చేశారు. ఇటీవల విడుదల వివిధ ఉద్యోగ నియామక ఫలితాల్లో ఖమ్మం రూరల్ మండలానికి చెందిన ఓ యువతి, ముదిగొండ మండలానికి చెందిన ఓ వివాహిత ఉత్తమ ప్రతిభ చాటి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
ఖమ్మం మండలం కొండాపురం ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న వేమూరి వెంకటేశ్వర్లు, భద్రమ్మ దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి వేమూరి అశోక్, ప్రమీల అనే ఇద్దరు సంతానం. కుమారుడు అశోక్ బీటెక్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. కుమార్తె వేమూరి ప్రమీల ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో కష్టపడి చదువుతోంది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో పీజీటీగా, టీజీటీగానూ, జూనియర్ లెక్చరర్గానూ ఎంపికైంది. మూడు ఉద్యోగాలు సాధించిన ప్రమీలను గ్రామస్తులు అభినందించారు.
ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గంటా అనురాధది నిరుపేద కుటుంబం. డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతుండగానే తల్లిదండ్రులు 2003లో ఆమెకు వివాహం చేశారు. చదువుకోవాలన్న పట్టుదలను ఆమె భర్త గమనించి ప్రోత్సహించాడు. దీంతో ఆమె డిగ్రీ, బీఈడీ పూర్తిచేసింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో పోటీపరీక్షలు రాస్తోంది. 2018లో జేపీఎస్ పరీక్షలో 75 మార్కులు వచ్చినా తుది జాబితాలో ఎంపిక కాలేదు. కానీ నిరాశ చెందకుండా ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో ప్రొబేషనరీ వ్యవధిలో ఉన్న కొందరు జూనియర్ పంచాయతీ కార్యాదర్శులు రాజీనామాలు చేయడంతో కొన్ని ఖాళీలు ఏర్పాడ్డాయి. అయితే మెరిట్ జాబితాలో వారి తరువాత స్థానంలో ఉన్న అనురాధ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా ఎంపికైంది. గత నెల పదో తేదీన నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో బాధ్యతలు చేపట్టింది. మరోవైపు పోటీ పరీక్షలకు కూడా ప్రిపేర్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో ఇటీవల గురుకుల ఉపాధ్యాయ టీజీటీ సోషల్ స్టడీస్ పోస్టుకు ఎంపికైంది.