రఘునాథపాలెం, ఏప్రిల్ 8 : లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు కంకణబద్దులై ఉండాలని, పార్టీ విజయం కోసం ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో వైస్ ఎంపీపీ గుత్తా రవి ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ గొంతుకను పార్లమెంట్లో వినిపించేందుకు, రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు మొండిచెయ్యి చూపిస్తోందని అన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 100 రోజుల్లోనే రాష్ట్ర ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 10 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారన్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలు ఏనాడూ జిల్లా, రాష్ట్ర ప్రయోజనాలను గుర్తించి మాట్లాడిందిలేదన్నారు. కేంద్రం నల్లచట్టాలు తీసుకొచ్చి మీటర్లు పెట్టాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ కొట్లాడి అడ్డుకుందని గుర్తుచేశారు. జిల్లాలో రూ.8 వేల కోట్ల విలువైన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చినట్లు పేర్కొన్నారు.
అజాత శత్రువు ఎంపీ నామా : బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు జీవితం తెరిచిన పుస్తకమని, శత్రువులు లేని శాశ్వత మిత్రుడు అని ఖమ్మంజిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. నామాను గెలిపించుకుంటే వచ్చే ఐదేళ్లు కార్యకర్తలకు కొండంత అండగా ఉంటారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, నాయకులు తాళ్లూరి జీవన్, మాజీ జడ్పీటీసీ కుర్రా భాస్కర్రావు, మద్దినేని వెంకటరమణ, మాదంశెట్టి హరిప్రసాద్, పిన్ని కోటేశ్వరరావు, మెంటం రామారావు, నున్నా శ్రీనివాసరావు, దొంతు సత్యనారాయణ, గొర్రె శ్రీను, దేశినేని నర్సయ్య, గంగిరెడ్డి విజయ్రెడ్డి, తాళ్లూరి హరీశ్, చీకటి రాంబాబు, తాతా వెంకటేశ్వర్లు, భద్రయ్య, సైదులు, సరిపూడి గోపి, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.