ఖమ్మం, డిసెంబర్ 19: దేశంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు క్రమంగా డిమాండ్ పెరుగుతున్నందున కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని, సహజ వ్యవసాయాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తోందో రాష్ట్రాల వారీగా వివరాలు తెలియజేయాలని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు గడిచిన మూడేళ్లలో మంజూరు చేసిన, వినియోగించిన నిధుల వివరాలను కూడా వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు.
సహజ వ్యవసాయంలో నిమగ్నమైన రైతులకు మారెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకుందో చెప్పాలని కోరారు. కాగా, ఎంపీ నామా ప్రశ్నలకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా సమాధానమిచ్చారు. సేంద్రియ వ్యవసాయానికి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా పరంపరగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై) ప్రారంభించామని, 2015-16 నుంచి దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. కాగా, రాష్ర్టాల వారీగా కేంద్రం సమాచారం ఇవ్వకపోవడంపై ఎంపీ నామా ఆగ్రహం వ్యక్తం చేశారు.