దమ్మపేట, అక్టోబర్ 26 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతి గడపకూ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందజేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. దమ్మపేటలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో గురువారం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం నేడు తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ హయాంలోనే సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ చేసిన అభివృద్ధే కనిపిస్తోందన్నారు. 50 ఏళ్ల కాలంలో కాంగ్రెస్, ఇతర పాలకులు చేయలేని అభివృద్ధిని తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ చేసి చూపించారన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.73వేల కోట్లు రైతుబంధు రైతులకు వర్తింపజేశారని, రూ.34వేల కోట్ల రుణమాఫీ నగదును రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కొందరు విపక్ష పాలకులు అభివృద్ధిని చూసినా కళ్లున్న కబోదుల్లా వ్యవహరిస్తూ అభివృద్ధి జరగలేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు గెలుపు కోసం కలిసికట్టుగా పని చేయాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ రావు జోగేశ్వరరావు, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, సర్పంచ్, ఉపసర్పంచ్లు ఉయ్యాల చిన్నవెంకటేశ్వరరావు, దారా యుగంధర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు యార్లగడ్డ బాబు, ఆయిల్పాం రాష్ట్ర కమిటీ సభ్యుడు అంకత ఉమామహేశ్వరరావు, నాయకులు కోటగిరి పుల్లయ్యబాబు, జలగం వాసు, రావుల శ్రీనివాసరావు, దిశ కమిటీ సభ్యులు గారపాటి సూర్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు ప్రకాశ్రావు, ఎస్కే సైదా, గాజుబోయిన ఏసుబాబు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సహాయ సహకారాలతో వరదలా నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. సీఎం కేసీఆర్ పాలన రామరాజ్యంలా ఉన్నదని, చిన్న సన్నకారు రైతుల నుంచి పేద, మధ్యతరగతి, అగ్రవర్ణాల ప్రజల వరకు అందరికీ సమన్యాయం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ప్రజల్లో బీఆర్ఎస్ మద్దతు మరింత పెంచేలా, ఎన్నికల్లో భారీ విజయం సాధించేలా కార్యకర్తలు సైనికుల్లా ప్రచారం చేయాలన్నారు. వామపక్ష పార్టీలు సైతం తాను చేసిన అభివృద్ధిని చూసి తనతో కలిసి వస్తున్నాయంటే బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం ప్రజలకు ఎంత అభివృద్ధి చేసిందో కార్యకర్తలే ప్రజలకు వివరించాలన్నారు. ఇటీవల బీఆర్ఎస్లో చేరిన జనసేన నియోజకవర్గ నాయకుడు యార్లగడ్డ శ్రీనుకు నియోజకవర్గ యువజన విభాగం నాయకుడిగా ఎంపీ సమక్షంలో బాధ్యతలు అప్పగించి సత్కరించారు. అలాగే ప్రజాప్రతినిధులు ఎంపీ, ఎమ్మెల్యేలను సత్కరించారు. ఎంపీటీసీ సోయం కుమారి ఇటీవల మృతిచెందగా ఆమె మృతికి సంతాప సూచకంగా మౌనం పాటించారు. అనంతరం మండలంలో బూత్ కమిటీ సభ్యులతో విడివిడిగా సమావేశమయ్యారు.