రఘునాథపాలెం, జనవరి 16: ఖమ్మం గులాబీ పండుగకు సిద్ధమైంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత మొట్టమొదటగా ఖమ్మంలో జరిగే సభకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో ‘ఔరా..’ నేలా ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. యావత్ దేశం దృష్టి ఖమ్మం సభపై ఉండేలా చేస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మంలో ఎక్కడ చూసినా గులాబీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.
ఖమ్మం నగరానికి చుట్టుపక్కల ఉన్న ప్రధాన రహదారులన్నింటినీ భారీ ప్లెక్సీలతో అలంకరించారు. ఈ ఫ్లెక్సీలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ర్టాలకు చెందిన ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఫొటోలతో ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటుతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తున్నది. అంతేగాక ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్ నుంచి బహిరంగ సభా ప్రాంగణం వరకు వైరా రోడ్డుపై మధ్యలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్తో ఇరువైపులా ఉన్న భారీ కటౌట్లు, భారీ ఫ్లెక్సీలు శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి.
ముమ్మర ఏర్పాట్లు..
ఖమ్మం వేదికగా ఈ నెల 18న జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగసభకు ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. సభా వేదిక ఏర్పాట్లను సోమవారం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దగ్గరుండి పరిశీలించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించే సమీకృత కలెక్టరేట్ను పర్యవేక్షించారు. ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, బహిరంగ సభకు వేదిక సిద్ధమైంది. ఏర్పాట్లలో ఎక్కాడా లోపాలు లేకుండా మంత్రులు హరీశ్రావు, అజయ్కుమార్ దగ్గరుండి పరిశీలించారు.
నిర్వాహకులకు సూచనలు చేశారు. 5 లక్షల మంది హాజరయ్యే సభలో ప్రజలందరూ సీఎం కేసీఆర్ సందేశంతోపాటు అతిరథ మహారథుల సందేశం వినేందుకు సభ చుట్టూ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సభికులందరూ కూర్చునేందుకు కుర్చీలను సిద్ధం చేశారు. సభా ప్రాంగణం మొత్తం కార్పెట్లను పరిచడంతో సభా వేదిక ప్రాంగణం శోభాయమానంగా దర్శనమిస్తోంది. సభాస్థలాన్ని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం పరిశీలించారు.