రఘునాథపాలెం, డిసెంబర్ 25: ఖమ్మం నగరానికి చెందిన ఓ బాలిక నేషనల్ లెవల్ డ్యాన్స్ ఫెస్టివల్లో సత్తా చాటింది. బహమతులూ గెలుచుకుంది. ఆ బాలికే.. మమత డెంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీ.వెంకటేశ్వరరావు కుమార్తె మాన్వి. తెలంగాణ ప్రభుత్వం, స్వర మహతి కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నర్సింహస్వామి దేవస్థానం వద్ద ఆదివారం జాతీయస్థాయి డ్యాన్స్ ఫెస్టివల్ను నిర్వహించారు.
ఇందులో ఖమ్మం సర్వజ్ఞ స్కూల్కు చెందిన 4వ తరగతి విద్యార్థిని మాన్వి పాల్గొని నృసింహ నృత్యాన్ని ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా ప్రతిభను చాటిన మాన్విని తల్లిదండ్రులు డాక్టర్ జీ.వెంకటేశ్వరరావు, డాక్టర్ జీ.అనిత, పాఠశాల యాజమాన్య బాధ్యులు అభినందించారు.