ఖమ్మం: రానున్న రోజుల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలతోనే సాగు రైతుల మనుగడ ఆధారపడి ఉందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జీ అనసూయ అన్నారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా జిల్లా రైతులు, ఉద్యానశాఖ అధికారులతో కలిసి ఆమె నాసిక్ నగర శివారు ప్రాంతాలలోని ద్రాక్ష, దానిమ్మ, ఉల్లి, గులాబీ తోటలను సందర్శించారు. దాక్షలో వివిధ రకాలైన తోటలు, వాతావరణ కేంద్రాలను సందర్శించి సాగులో మెలకువలు అడిగితెలుసుకున్నారు. మొక్కల పెంపకం నుంచి మొదలు కొని కోత వరకు యంత్రాల సహాయంతో సాగు చేస్తున్న విధానంపై జిల్లా ఉద్యానపంటల సాగు రైతులకు అక్కడి అధికారులు అవగాహన కల్పించారు.
సాగు రైతులు ఎల్లవేళల సర్కార్పై ఆదారపడకుండా ఐక్యతతో గ్రూపులుగా ఏర్పడి సాదిస్తున్న ప్రగతి గూర్చి అడిగి తెలుసుకున్నారు. రైతులు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడితే భవిష్యత్లో వ్యాపార వేత్తలుగా ఎదిగి మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుందని జిల్లా అధికారి రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల అధికారులు జీ .సందీప్కుమార్, జీ. నగేష్, కే మీనాక్షీ, ఆకుల వేణు తదితరులు పాల్గొన్నారు.