ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 15 : దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే ప్రతి సంవత్సరం వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా సంక్షేమాధికారి టి.సుమ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా స్త్రీ, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. తొలుత జిల్లా సంక్షేమాధికారి సుమ.. డీవైఎస్వో సునీల్కుమార్తో కలిసి ఆటల పోటీలను జెండాఊపి ప్రారంభించారు. క్యారమ్స్, చెస్, రన్నింగ్, షాట్పుట్, వీల్చైర్ అంశాల్లో పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు 350 మంది దివ్యాంగులు హాజరుకాగా.. 280 మంది వివిధ రకాల క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆటల్లో ప్రతిభ కనబరిచిన పలువురు దివ్యాంగులను రాష్ట్రస్థాయి దివ్యాంగుల క్రీడలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా దివ్యాంగులకు క్రీడలు నిర్వహించామన్నారు. కొద్ది రోజుల్లోనే జిల్లా మంత్రులు, కలెక్టర్ అనుమతితో దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు తేదీ ప్రకటిస్తామన్నారు. అదేరోజు క్రీడల్లో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. వివిధ గ్రామాల నుంచి వందల సంఖ్యలో తరలివచ్చి క్రీడలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు సంక్షేమ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.